నయీంనగర్, ఏప్రిల్ 24: గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్లోని పోచమ్మకుంట కేయూ మొదటి గేట్ ఎదుట ఉన్న జంగ భద్రయ్యకాలనీలో సోమవారం 80 మందికి చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. కాలనీ వాసులు తమ ఇళ్ల ముందు ముగ్గులు వేసి, మంగళహారతులతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇంటింటా పట్టాలు అందజేస్తూ ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా పేదల ముఖంలో ఆనందం దొరకదని భావోద్వేగానికి గురయ్యారు. పట్టాలు అందుకున్న గుడిసెవాసులు సంబురపడ్డారు. చీఫ్ విప్ మాట్లాడుతూ గుడిసెవాసులకు అండగా ఉంటానని రాష్ట్ర ప్రభుత్వ అన్నారు. సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.30 లక్షల వరకు ఉద్యోగాలు ఇచ్చారని, మరో 80వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారని గుర్తుచేశారు. మంత్రి కేటీఆర్ ఐటీ కంపెనీలను వరంగల్కు తీసుకొచ్చి యువతకు అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. గృహలక్ష్మి పథకం ద్వారా గుడిసె వాసులు ఇళ్లు కట్టుకొనేందుకు సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన దళితులకు దళిత బంధు అందజేస్తానని చెప్పారు. కేసీఆర్ నిర్ణయాలు తీసుకొని అమల్యందుకు ప్రణాళిక చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకుడు ప్రణయ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గుంటి రజిత, ప్రొఫెసర్ పుల్లా శ్రీనివాస్, కాలనీ వ్యవస్థాపకుడు కరుణాకర్, హనుమకొండ ఆర్డీవో వాసుచంద్ర, హనుమకొండ తహసీల్దార్ రాజ్కుమార్, సుగుణాకర్రెడ్డి పాల్గొన్నారు.
మాట తప్పని సీఎం కేసీఆర్
గతంలో ప్రభుత్వాలు హామీలు ఇచ్చి మరిచిపోయాయి. ఓట్లు వేయించుకొని వారినే చూశాం. కానీ, సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం పట్టాలు అందజేయడం చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన మాట తప్పని సీఎంగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతాడు.
– ఇందిర కొల్లూరి, కాలనీవాసి
చాలా సంతోషంగా ఉంది
ఇండ్ల పట్టాలు ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉంది. మా అమ్మమ్మ కదిరున్నీసా బేగం ఆనాడు వేసిన గుడిసెకు ఇప్పడు పట్టా నా చేతులకు వచ్చింది. ఈ ప్రభుత్వానికి ఎల్లప్పుడు తోడుంటాం. ఇచ్చిన మాట ప్రకారం జీవోతో పట్టాలు ఇవ్వడం ఎవ్వరు మర్చిపోలేరు.
– షహనా సుల్తాన్
నాయకులు మంచిగా ఉండాలి
సీఎం కేసీఆర్, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ నాకు కొడుకుల్లాంటోళ్లు. ఇంటి పత్రాలను ఇంటికే వచ్చి ఇవ్వడం సంతోషంగా ఉంది. పని చేసే నాయకులు ఎల్లప్పుడు మంచి గా ఉండాలి. సీఎం కేసీఆర్ పెట్టిన గృహలక్ష్మి పథకం కింద డబ్బులు ఇప్పిస్తాను.. మంచి ఇల్లు కట్టుకొని ఉండమని వినయ్భాస్కర్ చెప్పాడు.
– సుశీల, వృద్ధురాలు
కల నెరవేరింది..
గుడిసె వేసుకుని 33 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఉంటున్నా ఇంటి పత్రాలు అధికారికంగా లేవు. ఇప్పుడు సీఎం కేసీఆర్, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ దయవల్ల ఇంటి పేపర్లు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్ల కల నెరవేరింది.
– బిట్ల పద్మ