మహబూబాబాద్, డిసెంబర్6 (నమస్తే తెలంగాణ) :ఉమ్మడి రాష్ట్రంలో సాగు, తాగు నీరు, విద్యుత్ కోసం అష్టకష్టాలు పడిన తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రంలో నీళ్ల సమస్యను అధిగమించి తలెత్తుకొని నిలబడింది. సీఎం కేసీఆర్ ముందుచూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, వాగులపై కట్టిన చెక్డ్యాంలు వ్యవసాయాన్ని పండుగలా మార్చాయి. ముఖ్యంగా చెక్డ్యాంలతో వ్యవసాయానికి సాగునీరు పుష్కలంగా అందుతున్నది. దీంతోపాటు చెక్డ్యాంల చుట్టు పక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావులు 24 గంటలు నడిచినా నీళ్లు ఒడవడం లేదు. జిల్లాలో మున్నేరు, ఆకేరు, పాలేరు, వట్టివాగు, పాకాల వాగులు ప్రవహిస్తుండగా, వీటి మీద 42 చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం రూ.80కోట్లు మంజూరు చేసింది. పాలేరు వాగుపై 11, ఆకేరు వాగుపై 18, మున్నేరు వాగుపై 6, వట్టివాగుపై 3, పాకాలవాగుపై 4 చెక్డ్యాంలు నిర్మించనున్నారు. వీటిలో ఇప్పటి వరకు 25 చెక్డ్యాంల నిర్మాణాలు పూర్తికాగా, మిగిలిన 16 వివిధ దశల్లో ఉన్నాయి.
గూడూరు మండలంలో 4 చెక్డ్యాంలు, మహబూబాబాద్ మండలంలో ఒకటి, కేసముద్రంలో 2, పెద్దవంగరలో 2, తొర్రూరు మండలంలో 8 చెక్డ్యాంల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. డోర్నకల్ మండలంలో 4, మరిపెడ మండలంలో 3, చిన్నగూడూరులో ఒకటి, నర్సింహులపేటలో 3, దంతాలపల్లిలో 2, కేసముద్రంలో 2, గార్లలో 3, బయ్యారంలో 3, పెద్దవంగర మండలంలో ఒకటి, తొర్రూరు మండలంలో 3 మొత్తం జిల్లాలో 25 చెక్ డ్యాంల నిర్మాణం పూర్తికాగా, ఇప్పుడు జలకళతో ఉట్టిపడుతున్నాయి. వానకాలంలో సమృద్ధిగా కురిసిన వానలు, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తరలివస్తున్న గోదావరి జలాలు జిల్లాలో ఇప్పటికీ జిల్లాలోని చెక్డ్యాంలు మత్తడి పోస్తుండగా, మరికొన్ని నిండుగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఈ సారి యాసంగి సాగు ఎలాం టి ఢోకా లేదు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్మానేరు డ్యాం నుంచి ఎస్సారెస్పీ ద్వారా జిల్లాకు నీళ్లు వస్తున్నాయి. ఎస్సారెస్పీ స్టేజీ-1 డీబీఎం-48 ద్వారా 1,32,036 ఎకరాలు, ఎస్సారెస్పీ సేజీ-2 డీబీఎం -60 ద్వారా 45,130 ఎకరాలు, ఆయకట్టు చెరువుల ద్వారా మరో 57,757 ఎకరాలు, 13 ఐడీసీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా 6,950 ఎకరాలు జిల్లాలో మొత్తం 2,41,873 ఎకరాలు సాగవుతున్నది. జిల్లాలో కెనాళ్ల ద్వారా 386 చెరువులు, వర్షాల ఆధారంగా 1,236 చెరువుల్లోకి నీళ్లు వస్తున్నాయి.
చెక్డ్యాంల మత్తళ్ల మరమ్మతు, పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం జిల్లాకు రూ.12.74 కోట్లు ఖర్చు చేసింది. గార్ల మండలం బుద్దారం తుమ్మల చెరువు కోసం రూ.72.9 లక్షలు, గార్ల మండలం కేంద్రంలో పెద్ద చెరువుకు రూ.215.2 లక్షలు, బయ్యారం మం డలం వినోబానగర్ తులరాం ప్రాజెక్టుకు రూ.258.3 లక్షలు, గార్ల మండలం ముల్కనూర్ ఆనకట్ట కోసం 324.7లక్షలు, గార్ల మండలం రాంపురం ఊర చెరువుకు 83.8లక్షలు, కొత్తగూడ మండలం వెలుబెల్లి పెద్ద చెరువు కోసం 87.6 లక్షలు, కొత్తగూడ మండలం కొంటాలగూడెం చెరువుకు 98.8 లక్షలు, కొత్తగూడ మండలం గాంధీనగర్ ముసలమ్మ వాగు చెరువుకు రూ.69 లక్షలు, కొత్తగూడ మండలం ఓటాయి రాజుల కుంట ఆనకట్ట కోసం రూ. 64.28 లక్షలు కేటాయించగా, పనులు కూడా పూర్తయ్యాయి.