జడ్పీ సమావేశంలో తీర్మానానికి ఆమోదం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం
రెండు సీజన్ల వడ్లు కొనాలని డిమాండ్
వర్షాలకు పంట నష్టపోయిన రైతుల రుణాలు రీ షెడ్యూల్ చేయాలి
పంజాబ్లో గోధుమల మాదిరిగా తెలంగాణ వడ్లు కొనాల్సిందే : ఎమ్మెల్యే పెద్ది
వివిధ శాఖల అధికారుల తీరుపై సభ్యుల మండిపాటు
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల వడ్లను కొనితీరాలని వరంగల్ జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం బుధవారం తీర్మానించింది. టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులు మద్దతు తెలుపడంతో ఏకగ్రీవంగా ఆమోదించినట్లు జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి ప్రకటించారు. రాష్ట్ర రైతులు వానాకాలం, యాసంగి సీజన్లలో పండించిన వడ్లనే నేరుగా మద్దతు ధరకు కొనాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సమావేశంలో డిమాండ్ చేశారు. పంజాబ్లో రెండో పంట అయిన గోధుమలు కొన్నట్లుగానే తెలంగాణలో పండిన వడ్లను కొనాలన్నారు. కుట్రలో భాగంగానే యాసంగిలో రా రైస్ మాత్రమే కొంటామని చెబుతున్నదని మండిపడ్డారు. వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ ఉండాలన్నారు. ఇటీవల వడగండ్ల వానతో జిల్లాలో పంట దెబ్బతిన్న రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయాలని కూడా తీర్మానించారు.
వరంగల్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని జిల్లా ప్రజాపరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల నుంచి రెండు సీజన్ల వడ్లను కొనుగోలు చేయాలనే తీర్మానాన్ని టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న ప్రవేశపెట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులు, వడ్ల కొనుగోలుపై అనుసరిస్తున్న వైఖరిపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాట్లాడారు. వ్యవసాయాన్ని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయా రైతు కుటుంబాలను సోనియాగాంధీ పరామర్శించారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేశారని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు, 24గంటల నాణ్యమైన కరెంటు సరఫరా, అందుబాటులో విత్తనాలు, ఎరువులు ఉండడంతో దిగుబడులు పెరిగాయని తెలిపారు.
పంజాబ్లో రెండో పంటను కొంటున్న కేంద్రం
పంజాబ్లో గోధుమ రెండో పంట అని, దాన్ని కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నదని పెద్ది తెలిపారు. ధాన్యానికి మద్దతు ధర నిర్ణయించిన కేంద్రం తెలంగాణ ధాన్యాన్ని మాత్రం కొనేది లేదంటున్నదని విమర్శించారు. రా రైస్ మాత్రమే కొంటామని, బాయిల్డ్ రైస్ తీసుకోబోమని కేంద్రం కొర్రీ పెట్టిందని తెలిపారు. యాసంగి ధాన్యం నుంచి బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుందన్నారు. కేంద్రం తెలంగాణలో రైతుల నుంచి నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని, వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ ఉండాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులు పండించిన రెండు పంటల వడ్లను కేంద్రం కొనాలనే తీర్మానానికి సభ్యులు మద్దతు తెలపటంతో ఏకగ్రీవంగా ఆమోదించినట్లు జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి ప్రకటించారు. ఇటీవల కురిసిన వడగండ్ల వానతో జిల్లాలో పంట నష్టపోయిన రైతులకు రుణాలను రీ షెడ్యూల్ చేయాలని జడ్పీ ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించినట్లు వెల్లడించారు.
అధికారుల తీరుపై ఆగ్రహం
పలు శాఖల అధికారుల తీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం అమలులో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలను భాగస్వాములను చేయడం లేదని, సమావేశాలు నిర్వహిస్తే తమకు సమాచారం ఇవ్వడంలేదని మండిపడ్డారు. ఇదేమిటని ఎంఈవోలను అడిగితే తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు లేవని, డీఈవో పాఠశాలలను సందర్శించినా సమాచారం ఉండటం లేదన్నారు. ప్రజాప్రతినిధులను సమన్వయపరిచే బాధ్యత మండల ప్రత్యేక అధికారులకు అప్పగించాలని ఎమ్మెల్యే పెద్ది సూచించారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలను భాగస్వాములను చేయాలని ఎంఈవోలకు చెప్పాలని డీఈవో వాసంతిని ఆదేశించారు.
మంగళవారం దుగ్గొండి మండ లం బిక్కా జిపల్లిని సందర్శించిన డీపీవో స్వరూప సర్పంచ్ సీట్లో కూర్చుని సర్పంచ్ని నిలబెట్టి అవమానించారని జడ్పీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంతో బిక్కాజిపల్లిలో శ్మశానవాటిక ఇప్పటికీ లేదన్నారు. దీనిపై విచారణ జరిపిస్తామని కలెక్టర్ గోపి చెప్పారు. చెన్నారావుపేట ఎంపీవో సురేశ్ గతంలో అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్కు గురైనచోటే ఎంపీవోగా పోస్టింగ్ ఇచ్చారని, అతడిని సస్పెండ్ చేయాలని ఎంపీపీ విజేందర్ డిమాండ్ చేశారు. డీపీవో స్వరూప మాట్లాడుతూ ఎంపీ వో సురేష్ను కమిషనర్ కార్యాలయానికి పంపించనున్నట్లు తెలిపారు. పర్వతగిరి జడ్పీటీసీ సింగ్లాల్ మాట్లాడుతూ ఎన్పీడీసీఎల్ అధికారులు మండలంలో మిడిల్పోల్స్ వేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెపారు. కొందరు అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారని శాయంపేట ఎంపీపీ తిరుపతిరెడ్డి మండిపడ్డారు. జడ్పీ సీఈవో రాజారావు, వైస్చైర్మన్ శ్రీనివాస్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
నెక్కొండ కేజీబీవీపై వాడీవేడి చర్చ
జడ్పీ సమావేశంలో నెక్కొండ కేజీబీవీపై వాడీవేడి చర్చ జరిగింది. ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న మాట్లాడుతూ నెక్కొండ కేజీబీవీలో ఎస్వో, టీచింగ్ సిబ్బంది వర్గాలుగా ఏర్పడి భోజనం పెట్టకపోవడంతో పిల్లలు ధర్నా చేసినప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోపోవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్వాహకుల మధ్య సమన్వ యం లేక బాలికలకు భద్రత కూడా కరువైందని ఆవేద న వెలిబుచ్చారు. ఇరు వర్గాలను మరో కేజీబీవీకి పంపాలన్నారు. ఎంపీపీ విజేందర్ మాట్లాడుతూ డీఈవో వింటారు.. చూస్తారు గానీ చర్యలేమీ తీసుకోరని అన్నారు. ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ ఎస్వోతోపాటు బాధ్యులైన వారిని బదిలీ చేయడం మంచిదన్నారు. కలెక్టర్ గోపి స్పందిస్తూ నెక్కొండ కేజీబీవీ ఎస్వోను బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. సీఆర్టీలపై చర్యలు ఉంటాయన్నారు.