కొండాపూర్/దుండిగల్, ఆగస్టు 12 : యూనిటీ మాల్ టెండర్లను రద్దు చేసి, సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. రాయదుర్గంలోని మల్కం చెరువు ఎదురుగా పీఎం ఏక్తా ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలం వద్ద జరుగుతున్న పనులను బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించి, భూ కేటాయింపులు జరిగిన తీరుపై నిరసన తెలిపారు. అనంతరం దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ప్రాజెక్టు కోసం రూపొందించిన టెండర్ నిబంధనల ప్రకారం 27లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంలో ప్రభుత్వానికి 9లక్షల చదరపు అడుగులు మాత్రమే దకేలా, ప్రైవేట్ డెవలపర్కు 18లక్షల చదరపు అడుగులు కేటాయించేలా ఒప్పందాలు రూపొందించారని మండిపడ్డారు. వంశీరామ్అపర్ణ కన్సార్టియంతోపాటు మరికొన్ని సంస్థలకు ప్రాజెక్టు దకేలా పోటీని పరిమితం చేశారని ఆరోపించారు. డీపీఆర్లు, ఫైనాన్షియల్ మోడళ్లు, ఏరియా షేరింగ్ ఒప్పందాలు ప్రజలకు అందుబాటులో ఉంచకుండా రహస్యంగా వ్యవహరించడం వెనుక ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నదని నొక్కిచెప్పారు. సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు కేంద్రం నుంచి వచ్చే రూ.200 కోట్ల నిధులను వెంటనే నిలిపివేయాలని, ప్రజాధనాన్ని ప్రైవేట్ ప్రయోజనాలకు వినియోగించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వన్ డిస్ట్రిక్ట్వన్ ప్రొడక్ట్ (ఓడీవోపీ), జీఐ ఉత్పత్తులకు మారెట్ కల్పించడం దేశవ్యాప్తంగా యూనిటీ మాల్స్ ప్రధాన ఉద్దేశమని, కానీ ఇక్కడ మాత్రం హస్తకళాకారుల అభివృద్ధి నుంచి దారి మళ్లించి భారీ వాణిజ్య సముదాయంగా మార్చేశారని శ్రవణ్ ఆరోపించారు. హస్తకళాకారులకు ఎంత స్థలం, వాణిజ్య అవసరాలకు ఎంత స్థలం కేటాయించారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.
యూనిటీ మాల్ ప్రాజెక్ట్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తామని, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని, టెండర్లు రద్దయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం కొనసాగిస్తామని దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు స్పష్టంచేశారు. ఈ విషయమై పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. టెస్సరాక్ట్ కంపెనీ భూ కేటాయింపుల వెనుక ఉన్న అక్రమాలను ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిర్గతం చేశారని, రాయదుర్గంలో కూడా అదే రీతిలో అక్రమంగా భూములు కేటాయించారని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ భూ దోపిడీపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, ప్రభుత్వ అక్రమాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగడుతామని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పెద్ద ఘరానా మోసానికి పాల్పడుతున్నా రాష్ట్రంలోని బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేందని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సాయిబాబా, నవతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.