కల్లాలు నిర్మించుకోవాలనుకునే రైతులకు కేంద్రప్రభుత్వం కళ్లెం వేసింది. కొత్తవి కట్టద్దంటూ ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఎన్ఐసీ సాఫ్ట్వేర్లో ఆప్షన్ను తొలగించింది. నిర్మాణ దశల్లో ఉన్న వాటికి నిధుల విడుదలలో జాప్యం చేస్తున్నది. అసలే ఇది పంటలు చేతికొస్తున్న కాలం.. తుఫాన్ల ప్రభావం ఎక్కువగా ఉండడంతో పంట ఉత్పత్తులను ఎలా ఆరబెట్టుకోవాలని రైతులు దిగాలు చెందుతున్నారు. రైతుబంధు.. ఉచిత కరంటు.. సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అదునుకు అందిస్తూ రైతులకు అండగా ఉంటున్న రాష్ట్ర సర్కారు పంటలు చేతికొచ్చిన సమయంలో ఆరబెట్టుకోవడానికి ఇబ్బందిపడొద్దనే ఉపాధి నిధులతో కల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వీటికి కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుపుల్ల వేయడంతో కేంద్రప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు 2516 మంజూరు కాగా, 217 మంది రైతులు నిర్మించుకున్నారు. 337కల్లాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి .
బయ్యారం, నవంబర్29 : రైతులకు అండగా ఉంటున్న రాష్ట్ర సర్కారు పంటలు చేతికొచ్చిన సమయంలో ఆరబెట్టుకునేందుకు కల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఉపాధి పథకంలో భాగంగా అవకాశం కల్పించింది. రైతులు తమ అవసరాలకు తగినట్లు మూడు సైజుల్లో నిర్మాణానికి అనుమతి ఇచ్చి, నేరు గా బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసింది. 75 (10×7.5) ఫీట్లకల్లానికి రూ.75వేలు,60 (68×7.5) ఫీట్ల కల్లానికి రూ.66వేలు, 50(8×6.3) ఫీట్ల కల్లానికి రూ.55 వేలు ఇస్తున్నది. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు నూరుశాతం, ఓసీ, బీసీ కులస్తులకు 90 శాతం రాయితీని అందించింది. దీంతో చాలామంది రైతులు ముం దుకొచ్చి కల్లాలు నిర్మించుకున్నారు. జిల్లాకు 2,516 కల్లాలు మంజూరు కాగా 217 మంది నిర్మించుకున్నారు. మరో 337 కల్లాలు వివిధ దశల్లో ఉన్నాయి. కాగా, ఇంతవరకు బాగానే కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం గత జనవరి నెల నుంచి కొత్త కల్లాల నిర్మాణానికి అనుమతులు నిలిపివేసింది. దీంతో కల్లాలు మంజూరై నిర్మించని, నిర్మించాలనుకునే వారికి కళ్లెం పడింది. వివి ధ దశల్లో ఉన్నవాటికి కూడా నిధుల విడుదలలో కూడా జాప్యం చేస్తున్నది. గత జనవరి నెలలో కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ ఎన్ఐసీ సాఫ్ట్వేర్లో నూతన నిర్మాణాలకు అవకాశం లేకుండా ఆష్షన్ను తొలగించింది. ఉపాధి పథకంలో భాగంగా రైతులకు ఉపయోగపడే కల్లాల నిర్మాణాన్ని నిలిపివేయడంతో రైతులు కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతుల అవస్థలు
జిల్లాలో 4.26లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంట లు సాగు చేస్తున్నారు. వీటిల్లో మక్కజొన్న, పెసర, కంది, మినుము, వరి వంటి నూర్పిడి పంటలను విక్రయానికి ముందు తప్పని సరిగా ఆరబెట్టాల్సి ఉంటుం ది. అయితే, కేంద్రం కల్లాల నిర్మాణం నిలిపివేయడం తో రైతులు ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతం ధాన్యం, మక్కజొన్న చేతికి రావడంతో కొందరు రైతు లు ఆరబెట్టుకునేందుకు కల్లాలు లేక నేరుగా మార్కెట్కు తరలిస్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉండడంతో మిల్లర్లు తరుగు తీయడంతో నష్టపోతున్నారు. మరికొందరు రహదారుల వెంట పంటలను ఆరబెట్టుకుంటున్నారు. బయ్యారం, గంగారం, కొత్తగూడ, గార్ల, గూడూరు వంటి మండలాల్లో ఈ ఏడాది 33వేల ఎకరాల్లో మక్కజొన్న సాగు చేశారు. ప్రస్తుతం పంట చేతికొస్తుండడం తో అందుబాటులో కల్లాలు లేక రహదారుల వెంట ఆరబోస్తున్నారు. దారిని సగానికి పైగా ఆక్రమించి, టార్పాలిన్లు పరిచి మక్కలను ఆరబోయడంతోపాటు వాటికి అడ్డంగా కర్రలు, రాళ్లు పెట్టడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.
మంజూరైనా కట్టుకోలేక పోతున్నా..
కల్లం నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైంది. పనులు మొదలు పెడదామనుకుంటే అధికారులు వద్దని అంటున్నారు. సాఫ్ట్వేర్ మారడం వల్ల కొత్త నిర్మాణాలకు అనుమతి లేదని చెబుతున్నారు. కల్లం నిర్మాణానికి నిధులు మంజూరైనా కట్టుకోలేక పోతున్నా. పంటలు ఆరబెట్టుకునేందుకు చాలా ఇబ్బందిపడుతున్నాం.
– ఐ శ్రీనివాస్, రైతు (బయ్యారం)