తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో మంగళవారం ఉదయం మేయర్ గుండు సుధారాణి తీర్మానాన్ని ప్రతిపాదించగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి బలపరిచారు. ప్రతులను ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు పంపిస్తామని మేయర్ ప్రకటించారు. గ్రేటర్ పరిధిలో రూ. 4.15 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సమావేశంలో పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ట్రేడ్ లైసెన్స్ల ఫీజుల పెంపు, నగరంలో జనాభా ప్రాతిపదికన వైకుంఠ రథాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
– వరంగల్, మార్చి 29
రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన మంగళవారం గ్రేటర్ సర్వసభ్య సమావేశం జరిగింది. రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకూ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. కేంద్రం రాష్ట్రంపై వివక్ష చూపుతోందని మండిపడింది. కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలన్న తీర్మానా న్ని మేయర్ గుండు సుధారాణి ప్రతిపాదించగా ఎమ్మె ల్సీ కడియం శ్రీహరి బలపరిచారు. దీంతో సమావేశం తీర్మానానికి ఆమోదముద్ర వేసింది. తీర్మాన ప్రతులను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు పంపిస్తామని మేయర్ సమావేశంలో ప్రకటించారు. ఉదయం 11.45 గంటలకు సభ ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన మాజీ కౌన్సిలర్ బింగి సమ్మయ్య మృతికి సంతాపం ప్రకటించారు. 24వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
సమావేశం ప్రారంభమైన వెంటనే జీడబ్ల్యూఎంసీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయనకు మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కార్పొరేటర్లు పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో సన్మానించారు.
గ్రేటర్ పరిధిలో రూ.4.15కోట్ల నిధులతో చేపట్టను న్న అభివృద్ధి పనులకు సమావేశంలో పరిపాలనా అనుమతులను మంజూరు చేశారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతిచెందిన ఇద్దరు పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించే అంశానికి కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. 90మంది అర్బన్ మలేరియా కార్మికుల దినసరి వేతనం రూ.427 చెల్లించేందుకు ఏడాది కాలానికి పరిపాలనా అనుమతి ఇచ్చారు. స్వచ్ఛ ఆటో డ్రైవర్లు కం ఓనర్లకు నెలకు స్వచ్ఛ ఆటోల నిర్వహణ కోసం నెలకు రూ.15 వేల చొప్పున మార్చి 2022 నుంచి చెల్లించేందుకు సమావేశం ఆమోదం తెలిపింది. దీంతోపాటు స్వచ్ఛ ఆటోడ్రైవర్లు ఓనర్స్ పథకంలో కొనుగోలు చేసిన స్వచ్ఛ ఆటోలకు ఈఎంఐ చెల్లింపులకు అంగీకారం చెప్పింది. తడి చెత్తతో జీవ రసాయన ఇంధనం తయారు చేసేందుకు గ్రేటర్ పరిధిలోని పైడిపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సర్వే నంబర్ 1161/1లో రెండు ఎకరాల స్థలం కేటాయించేందుకు కౌన్సిల్ ఆమోద్ర ముద్ర వేసింది.
ట్రేడ్ లైసెన్స్ ఫీజుల పెంపునకు గ్రేటర్ కౌన్సిల్ సమావేశం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వ్యాపారాలు, వ్యాపా ర సముదాయాలు రోడ్డు వైపు ఉన్న వెడల్పు ఆధారం గా ట్రేడ్ లైసెన్స్ ఫీజులను మదింపు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. దీంతోపాటు గ్రేటర్ పరిధిలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు కొత్త ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు, ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరణ సమయం లో రూ.వెయ్యి హరిత నిధి కోసం వసూలు చేసేందుకు ఆమోదం తెలిపింది. వైకుంఠ రథాల నిర్వహణ బాధ్యతలను రోటరీ క్లబ్ నిర్వహించే అంశాన్ని తిరస్కరించారు. కేవలం రెండు వైకుంఠరథాలు కాకుండా జనాభా ప్రాతిపదికన మరిన్ని వైకుంఠ రథాలు ఏర్పాటు చేయాలని సమావేశం సూచించింది. వడ్డేపల్లిలోని సర్వే నంబర్ 873లో 743 గజాల స్థలం శ్మశానవాటికకు ఇస్తున్న క్రమంలో బదులుగా శాయంపేటలో సర్వే నంబర్ 579లో వెయ్యి గజాల స్థలం కేటాయించాలన్న అంశాన్ని కౌన్సిల్లో సభ్యులు తిరస్కరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కమిషనర్ ప్రావీణ్య, అధికారులు, పాల్గొన్నారు.
తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పక్కా సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించాం. సమర్థంగా తాగునీటి సరఫరాకు 66 డివిజన్లను రీ జోన్లుగా విభజించేందుకు చర్యలు చేపడుతున్నాం. 2048 సంవత్సరం వరకు సరిపడా రా వాటర్ నగర ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎల్ఎండీ నుంచి ధర్మసాగర్ వరకు చేపడుతున్న రా ట్రంక్ మెయిన్ ఇంటర్ కనెక్షన్ పనులు పూర్తిచేశాం. పాత వాల్వ్ల స్థానంలో కొత్త వాల్వ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. 24 గంటల నిరంతర తాగునీటి సరఫరాకు డీపీఆర్ను సిద్ధం చేశాం.
– గుండు సుధారాణి, మేయర్
గ్రేటర్లో జనాభాకు అనుగుణంగా వైకుంఠ రథాలు కొనుగోలు చేయాలి. ఆఖరి మజిలీ గౌరవంగా, మర్యాదగా సాగేలా నగర జనాభాను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు చేయాలి. గ్రేటర్లో సుమారు 100 వైకుంఠధామాలు ఉన్నాయి, వాటికి సరిపడే విధంగా వైకుంఠ రథాలు ఉండాలి. ఇందుకోసం అధికారులు ప్రతిపాదనలు రూపొందించాలి.
– కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ
శ్మశాన వాటికకు స్థలం ఇచ్చినందుకు వేరే చోట స్థలం కేటాయించాలన్న ప్రతిపాదన మంచి ది కాదు. ఇది కొత్త కోణానికి తెరలేపుతోంది. శ్మశా న వాటికల సమగ్ర సమాచారం తెప్పించుకుని పరిశీలించిన తర్వాత కౌన్సిల్ ముందుకు తీసుకురావాలి. ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నాయో వివరాలు సేకరించాలి.
– బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ
కొత్త ట్రేడ్ లైసెన్స్లు, రెన్యూవల్ ట్రేడ్ లైసెన్స్లకు అనుమతి ఇచ్చే సమయంలో హరిత నిధి కింద రూ.వెయ్యి వసూలు చేయడం సరికాదు. దీని వల్ల చిన్న వ్యాపారులపై భారం పడుతుంది. ఇప్పటికే ఉన్న ట్రేడ్లను కేటగిరీలుగా విభజించాలి. స్లాబ్లుగా కేటాయించాలి. గ్రీన్ బడ్జెట్లోలో భాగంగా గ్రేటర్ ఖజానాలో రూ.18 కోట్లు ఉన్నాయి. హరిత నిధి వసూళ్ల అంశాన్ని పునఃపరిశీలించాలి.
– నన్నపునేని నరేందర్, తూర్పు ఎమ్మెల్యే