వరంగల్, ఆగస్టు 11 : నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరిగిన వరద నష్టంపై సమగ్ర ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని సీడీఎంఏ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆమె కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. జవహర్ కాలనీ, నయీంనగర్, కాకతీయ నాలా, సమ్మయ్య నగర్ , రాజాజీ నగర్, భధ్రకాళి బండ్, బొంది వాగు, భద్రకాళి చెరువు కట్ట గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించి, వరద నష్టంపై అంచనాలు వేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన మరమ్మతు, నష్ట పునరుద్ధరణ పనులపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం కుడా కార్యాలయంలో ఆమె అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు వరద నివారణ చర్యలపై మార్గనిర్దేశం చేశారు.
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వరంగల్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించినట్లు తెలిపారు. వరంగల్ నగర ముంపునకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నాలుగు రోజుల క్రితం ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ శ్రీధర్ నగర వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారని చెప్పారు. వరద ముంపు నివారణలో భాగంగా హైదరబాద్లో చేపట్టిన స్ట్రాటజికల్ నాలా డెవలప్మెంట్ ప్రొగ్రాంను వరంగల్లో అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్లో ఎస్ఎన్డీపీలో బాగంగా డీపీఆర్ రూపొందించిన కన్సల్టెన్సీ ప్రతినిధులు వరంగల్ నాలాపై కూడా డీపీఆర్ రూపొందిస్తున్నారన్నారు. ఎస్ఎన్డీపీ అమలు చేసేలోగా నాలాపై ఉన్న అక్రమ కట్టడాలను తక్షణమే తొలగించే ప్రక్రియను చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు. నాలాలో పేరుకు పోయిన వ్యర్థాలను పూడికతీత ద్వారా తొలగించాలని సూచించారు.
నగర వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన పునరుద్ధరణ పనులు, నగర ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ టీయూఎఫ్ఐడీసీ నుంచి తక్షణ సాయంగా మంజూరు చేసిన రూ.250 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని సత్పతి అధికారులను ఆదేశించారు. ముంపు నివారణకు చేపట్టాల్సిన కీలక పనులు ప్రతిపాదనల్లో ఉండాలని ఆమె సూచించారు. 2020లో వరద వచ్చిన సమయంలో రూపొందించిన డీపీఆర్లో మిగిలిన పనులను ప్రస్తుతం రూపొందిస్తున్న డీపీఆర్లో జోడించాలని ఆమె ఆదేశించారు. భవిష్యత్లో వరంగల్ నగరం వరద ముంపునకు గురికాకుండా ఉండేలా డీపీఆర్ను సమగ్రంగా రూపొందించాలన్నారు.
నగరంలో చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆమె ఆదేశించారు. భద్రకాళి ఆలయం చుట్టూ రూ.30 కోట్లతో చేపట్టనున్న మాడ వీధుల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. రూ.75కోట్లతో నిర్మించనున్న వరంగల్ బస్స్టేషన్ పనులను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ప్రయాణికుల కోసం తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు పనులను ప్రారంభించాలని ఆదేశించారు. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కళాక్షేత్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆమె నిర్మాణం పూర్తవ్వడానికి కావాల్సిన రెట్టింపు సిబ్బందిని సమకూర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. కుడా ఆధ్వర్యంలో ఈనెల 20న ఉనికిచర్లలో చేపట్టనున్న ప్లాట్ల వేలం పాటలను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. ఉనికిచర్ల లేఅవుట్ స్థలాన్ని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అభివృద్ధి పనులను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చాడా స్వాతి, సిరంగి సునీల్కుమార్, బల్దియా ఎస్ఈలు ప్రవీణ్చంద్ర, కృష్ణారావు, స్మార్ట్సిటీ పీఎంవో ఆనంద్ ఓలేటి, సిటీ ప్లానర్ వెంకన్న, కుడా పీవో అజిత్రెడ్డి, ఈఈలు రాజయ్య, శ్రీనివాసరావు, భీంరావు, ఇరిగేషన్, కుడా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
నగరంలోని ప్రసిద్ధి చెందిన భద్రకాళీ అమ్మవారిని సీడీఎంఏ పమేలా సత్పతి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ప్రధాన అర్చకుడు భద్రకాళీ శేషు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం మహామండపంలో ఆమెకు ఆశీర్వచనం ఇచ్చి, అమ్మవారి శేష వస్ర్తాలు, ప్రసాదాలు అందజేశారు.