జనగామ, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : ‘ఈ ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే..మనమంతా ఒక కుటుంబంలాగా పని చేద్దాం.. భవిష్యత్ మనదే..’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. బుధవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధ్యక్షతన పసరమడ్లలోని ఉషోదయ కన్వెన్షన్లో జరిగిన జనగామ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి అతిథులుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతున్నదన్నారు. ‘అధికారులు, పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా పనిచేయండి.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే.. ఇలాగే ఉంటే అప్పుడు మీ భరతం పడతాం..’ అని హెచ్చరించారు. కేసీఆర్కి జనగామ అంటే ఎంతో గౌరవం, ప్రేమ, ఏ అంశం ప్రస్తావనకు వచ్చినా జనగామ, నర్మెట, బచ్చన్నపేట, చేర్యాల గురించే ఆయన ప్రస్తావిస్తారని గుర్తుచేశారు. జనగామ గడ్డ మీద హ్యాట్రిక్ విజయం అందించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, మంచి రోజులు వస్తాయన్నారు.
బీఆర్ఎస్కు ఉద్యమాలు, నిర్బంధాలు కొత్త కాదు, అధికారమైనా ప్రతిపక్షమైనా మనది ప్రజల పక్షం అని హరీశ్రావు అన్నారు. అనేక ఉద్యమాలు చేసిన గడ్డ జనగామ ప్రాంతం ఇవ్వాల కాంగ్రెస్ పార్టీ నేతలు నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతున్నారని, వాళ్ల మొఖానికి నీళ్లన్నా ఇచ్చిండ్రా, తుపాకులగూడెం వద్ద గోదావరిపై బ్యారేజీ కట్టి దేవాదుల ద్వారా సంవత్సరం మొత్తం నీళ్లు అందించిన ఘనత మనదని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యా రెంటీలు సహా మొత్తం 420 హామీలిచ్చి అమలు చేస్తమన్నరు.. ఇప్పుడు కొండనాలికకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు మాట్లాడుతున్నాడని హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాల గురించి గ్రామాల్లో చర్చ పెట్టాలని, రైతు బంధు ఇవ్వొద్దని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ఆపించారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చాక రైతుబంధు ఇవ్వడం లేదన్నారు. కరోనా కష్టకాలంలో కూడా రైతుబంధు టంచన్గా ఇచ్చి నం, ఇప్పుడు అడిగితే రైతులకు ఆపి ఉద్యోగులకు జీతాలు వేసినం అంటున్నారని, అటు జీతాలు రాలె.. ఇటు రైతు బంధు పడలేదన్నారు. కాంగ్రెస్ నాయకులకు వ్యంగ్యం తప్ప వ్యవహారం తెలవదని, ప్రగతిభవన్ కట్టిస్తే అందులో బంగా రు బాత్రూంలు కట్టించుకున్నారని అబద్ధ్దపు ప్రచారాలు చేశారని హరీశ్రావు విమర్శించా రు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదని అబద్ధాలు చెప్పారని, కాంగ్రె స్ ప్రభుత్వం రైతులను నాలు గు రకాల మోసాలు చేసిందన్నారు. రైతుబంధు, రుణమాఫీ, 24 గంటల ఉచిత కరెంటు, వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామన్న హామీ లు తప్పారని, ఇప్పుడు కరెంటు 14 గంట లు కూడా వస్తలేదన్నారు.
ప్రమాణ స్వీకారం రెండు రోజుల ముందే చేస్తివి.. హామీలేమో ఆలస్యం చేయబడితివి, రూ. 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటేనే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రైతులు ఓటు వేస్తారని, మహాలక్ష్మీ పథకం కింద నెలకు రూ.2500 ఇస్తేనే మహిళలు ఆ పార్టీకి ఓట్లేస్తారని హరీశ్రావు అన్నారు. కర్ణాటకలో కూడా ఆరు గ్యారెంటీలు అమ లు చేస్తామని హామీ ఇచ్చి ఇన్ని నెలలైనా ఇస్తలేరని, అకడ ప్రజలు ధర్నాలు చేస్తున్నారని అన్నారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడుతా అని మంత్రి అంటే సీఎం రేవంత్రెడ్డి మాటలు రాష్ట్రం పరువు తీసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే 40 ఎంపీ సీట్లు గెలవాలని, ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన మమ తా బెనర్జీ సవాల్ విసిరిందని, ఆ పార్టీ గెలిచేది లేదు, సచ్చే ది లేదని హరీశ్రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మెడ లు వంచాలంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించి బుద్ధి చెప్పాలన్నారు. రాహుల్గాంధీ ప్రధాని అవ్వడం కాదు కదా .. ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం కూడా వచ్చే అవకాశం లేదని హరీశ్రావు పేర్కొన్నారు. కాళేశ్వరం మీద ఎన్నో అసత్యాలు చెబుతున్నారని, చిన్న సమస్య ఉంటే వెతికి పరిషరించి నీళ్లు అందించాలి తప్ప రాజకీయం చెయ్యొద్దని హితవు పలికారు. సోనియా పుట్టిన రోజున పదవీ స్వీకారం చేస్తా అన్న రేవంత్ ముందే చేశాడు.. కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో మాత్రం ఆలస్యం చేస్తున్నాడని ఆయన మండి పడ్డారు.
అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి 60 రోజుల్లోనే రైతాంగానికి నాలుగు మోసాలు చేసిన భట్టేభాజ్ కాంగ్రెస్ పార్టీ మోసాలను, సీఎం రేవంత్రెడ్డి నిజ స్వరూపంపై ప్రజల్లో చర్చకు పెట్టాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు రేవంత్రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలు, ప్రకటనలపై వీడియో క్లిప్లను సమావేశంలో స్క్రీన్లపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రదర్శించిన హరీశ్రావు ఝాటాకోర్ మాటలతో సీఎం రేవంత్రెడ్డి కాలం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక సమక్షంలో రేవంత్రెడ్డి నిరుద్యోగ భృతి హామీ ఇస్తే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వలేదని అబద్ధాలు చెప్పి న అంశాన్ని హరీశ్రావు వీడియో క్లిప్లో చూపించారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రె స్ ప్రభుత్వానికి ఇంకా 40 రోజుల గడువే మిగిలి ఉందన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ ఎన్నికల కోడ్ కంటే ముందే జీవోలు విడుదల చేయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు.
క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్, మహిళలకు గృహజ్యోతి పథకం కింద నెలకు రూ.2500, పింఛన్ రూ.4 వేలకు పెంచకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు, రైతుల ఓట్లు ఎట్లా అడుగుతారని హరీశ్రావు ప్రశ్నించారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో 96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే, ఇప్పుడు 3 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తున్నదన్నారు. ఇదంతా ఊరికే సాధ్యమైందా? కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్న నాయకులు కేసీఆర్ వల్లే ఇంత దిగుబడి పెరిగిందన్న సంగతి తెలియదా? అని అన్నారు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లను గెలిపిస్తే రాహుల్గాంధీ ప్రధాని అయితేనే ఆరు గ్యారెంటీలు అమలవుతాయన్న సీఎం మాటలు విడ్డూరంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు, పథకాలు అమలయ్యేది లేదన్నారు.
జనగామ బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడుతుండగానే పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్ సాయంతో మైక్లో మాట్లాడిన మాజీ మంత్రి హరీశ్రావు మార్పు వచ్చింది కదా అంటూ ఛలోక్తి విసరడంతో సభలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం డౌన్డౌన్, కాంగ్రెస్ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వంతో కొట్లాడైనా నెరవేరుస్తానని, నా సొంత ఆస్పత్రిలో జనగామ నియోజకవర్గం ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్న.. ఇది ఐదేళ్లు కొనసాగుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి నాకు వచ్చే జీతం ప్రతి రూపాయి నియోజకవర్గ అభివృద్ధికి కేటాయిస్తానని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే నా గెలుపు కోసం కృషి చేశారో.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ అలాగే పని చేసి బీఆర్ఎస్ను గెలిపిద్దామన్నారు. జనగామ జిల్లాలో గత సంవత్సరం ఈ సమయానికి అన్ని చెరువుల్లో 80 శాతం నీళ్లు ఉండేవని, ఇప్పుడు 20 శాతం కూడా లేని ఫలితంగా యాసంగి సాగు తగ్గిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సరిగ్గా కరెంటు, నీళ్లు రావడం లేదని, అధికారులు గత ప్రభుత్వంలో లబ్ధిపొంది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా మా నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఒకటి గుర్తు పెట్టుకోండి మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే. అప్పుడు మేమెంటో చూపిస్తాం అని పల్లా రాజేశ్వర్రెడ్డి హెచ్చరించారు.
జనగామ రూరల్, ఫిబ్రవరి 7: అధికార కాంగ్రెస్లో గ్రూపు తగాదాలున్నయి.. వాళ్లలో సమన్వయం లేక బజార్ల పడుతరు.. నాకు 40 ఏండ్ల రాజకీయ అనుభవం ఉంది. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన.. ప్రజలు మార్పు కోరుకోవడంతో ఓటమి చెందా. గతంలో ఎన్టీఆర్ కూడా ఇలాగే ఓడిపోయినా తర్వాత ప్రజలు గ్రహించి మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చారు. ఓడించిన నాయకులను ప్రజలు మళ్లీ గెలిపిస్తరు. కాంగ్రెస్లో గ్రూపు తగాదాలతో వారే బయటపడుతరు. కృష్ణా జలాల కోసం గతంలో కేసీఆర్పై ఒత్తిడి తెస్తే అవకాశం ఇవ్వలె.. అదే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అవకాశం ఇచ్చింది. మన ప్రభుత్వం లేదని కార్యకర్తలు బాధపడొద్దు. ఆదుకోవడానికి అందరం ఉన్నం. అండగా ఉంటాం. జనగామ జిల్లాకు సాగునీరందించి కరువును తరిమేసినం.
చార్సౌ బీస్ హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వీటిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మరేది అమలు కాలె. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించాడు. ఎక్కడ అమలైంది. రైతుబంధులో ఎకరాకు రూ.15 వేలు ఇస్తామన్నరు. ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని మోసం చేశారు. మహాలక్ష్మీ పథకంలో మూడు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. పేద మహిళలకు రూ.2500, వంటగ్యాస్ సిలిండర్ను రూ.500 ఇస్తామన్న హామీలు నేటికీ నెరవేరలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పటికే 60 రోజులు గడిచినయ్. కాలయాపన చేస్తున్నారు తప్ప అమలు దిశగా అడుగులు పడడం లేదు. వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికలయ్యాక అమలు చేస్తమని చెబుతరు. కాంగ్రెసోళ్లు వాళ్లలో వాళ్లే కొట్టుకోవడం ఖాయం. మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. తెలంగాణ బాగుకోసం కొట్లాడింది బీఆర్ఎస్ మాత్రమే. రాష్ట్ర అభివృద్ధికి, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు పార్లమెంట్లో గళం వినిపించడానికి బీఆర్ఎస్ను గెలిపించాలి. కాంగ్రెస్ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోయింది. హామీలు అమలు చేయడం లేదని ప్రజల్లో చర్చ జరుగుతున్నది. సీఎం రేవంత్రెడ్డి ఉద్యమ నేత కేసీఆర్పై వాడిన భాష ఆయన సంస్కారానికి అద్దం పడుతున్నది. సీఎం అని మరిచి ఓ పార్టీకి అధ్యక్షుడిననే భ్రమలో ఉండి మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు రైతుబంధు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు పంట సాయం వచ్చిందో మంత్రి కోమటిరెడ్డి తెలుపాలి. అప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలో రైతులే చూసుకుంటరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తాం. ఉమ్మడి జిల్లాలోని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం.
కరువు ప్రాంతమైన జనగామ జిల్లాకు గోదావరి జలాలు తీసుకురావడం కేసీఆర్కే సాధ్యమైంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలు, రైతుబంధు సాయం ఇవ్వడం బీఆర్ఎస్ పాలనలోనే సాధ్యమైంది. ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ రైతులకు కరెంట్ కోతలు తప్పడం లేదు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచులను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి, మాజీ మార్కెట్ చైర్మన్లు బాల్దె సిద్ధిలింగం, మల్లేశం, గాడిపల్లి ప్రేమలతారెడ్డి, బండ పద్మ, జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, ఎంపీపీలు మేకల కళింగరాజు, కృష్ణారెడ్డి, కరుణాకర్, జడ్పీటీసీలు సిద్ధప్ప, శ్రీనివాస్, దీపిక, బీఆర్ఎస్ నాయకులు పసుల ఏబెల్, జనగామ వీరేందర్ రెడ్డి, ఇర్రి రమణారెడ్డి, గద్దల నర్సింగరావు, బాల్దె విజయ, పెద్ది రాజిరెడ్డి, శ్రీధర్రెడ్డి, భిక్షపతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బైరగోని యాదరిగిగౌడ్, చంద్రారెడ్డి, నాయకులు చినబోయిన రేఖ, సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షులు బొల్లం శారద, గంగం సతీశ్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షురాలు లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ రాంప్రసాద్, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామశాఖల అధ్యక్షులు పాల్గొన్నారు.