మహదేవపూర్, మార్చి 1 : కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్లో కుంగిన పియర్లకు ప్రభుత్వం వెంటనే మరమ్మతు చేసి రైతులకు నీరందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ముందుగా మేడిగడ్డ బరాజ్ సందర్శనకు వచ్చిన కేటీఆర్ బృందానికి బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఘన స్వాగతం పలికి స్వయంగా బరాజ్ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం అన్నారం వద్ద వేదికపై కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మేడిగడ్డ అంశంపై రాద్ధాంతం చేస్తున్నదని మండిపడ్డారు. వానకాలంలో వరద వచ్చే నాటికి మేడిగడ్డలో పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి నీళ్లు ఎగువకు లిఫ్ట్ చేయాలని తెలిపారు. రైతులపై, రాష్ట్రం మీద పగబట్టొద్దని, కోపం ఉంటే తమపై చూపాలని రైతులను ఆగం చేయొద్దని కోరారు. 1.6 కి.మీ.ల బరాజ్లో 50 మీటర్లలో సమస్యలు ఉంటే అదేదో ఎప్పుడూ జరగనట్టు కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం తగదన్నారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కడెం, గుండ్లవాగు సహా ఎన్నో ప్రాజెక్టులు కొట్టుకుపోయిన సందర్భాలున్నాయని గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే నిపుణుల సలహాలు, సూచనలు తీసుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టి బరాజ్ను పునరుద్ధరించి రైతులకు న్యాయం చేయాలన్నారు. అనంతరం ఇరిగేషన్ నిపుణులు దామోదర్రెడ్డి మాట్లాడుతూ బరాజ్లో ఏర్పడిన సమస్యలను గుర్తించి గ్రౌటింగ్ చేసి బరాజ్ను కాపాడాలన్నారు. బరాజ్ను ఇలాగే వదిలేస్తే మరింత నష్టం వాటిల్లే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సత్వరమే మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తేవాలన్నారు.