జయశంకర్ భూపాలపల్లి, జూలై 4, (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లికి ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ను పరిశీలించనున్నారు. మేడిగడ్డ బరాజ్తో సంబంధం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశమున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును కేటీఆర్ ఎండగట్టనున్నారు.
వరంగల్, కరీంనగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలకు చెందిన పార్టీ సీనియర్ నాయకులు ఆయన వెంట రానున్నారు. ఈ మేరకు శనివారం భూపాలపల్లి, మంథని మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పుట్ట మధు వివరాలు వెల్లడించారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న కేటీఆర్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో కన్నెపల్లికి చేరుకొని పంప్హౌస్తో పాటు వృథాగా సముద్రంలో కలుస్తున్న వేలాది క్యూసెక్కుల గోదావరి జలాలను పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం 2 నుంచి 3 గంటల మధ్య మీడియా సమావేశంలో పాల్గొంటారని గండ్ర, పుట్ట మధు పేర్కొన్నారు.