రాయపర్తి, నవంబర్ 8 : సమైక్య పాలనలో అన్నిరంగాల్లో అభివృద్ధికి నోచుకోక భంగపడ్డ తెలంగాణను ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని, ఒకప్పుడు పల్లేర్లు మొలిచిన బీడు భూములు నేడు పచ్చబడుతున్నాయని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం మండలంలోని రాగన్నగూడెం, గణేశ్కుంట తండ, జేతురాంతండా, జింకురాంతండా, కేశవాపురం, ఎర్రకుంటతండా, కొలన్పల్లి, జయరాంతండా(కే), పోతిరెడ్డిపల్లి, వాంకుడోత్తండా, కిష్టాపురం, పన్యానాయక్ తండా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత రాగన్నగూడెంలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఇంటింటికీ వెళ్లి కారు గుర్తులకు ఓట్లు వేయాల్సిందిగా ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ స్వాతంత్య్రం అనంతరం కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఆరు దశాబ్దాల పాలనలో తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఇక్కడి వనరులను దోచుకోవడమే తప్ప ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించలేదన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో బీడు భూములు సస్యశ్యామలమయ్యాయని ఎర్రబెల్లి వివరించారు. ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సహకరించకుండా తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలను అరవై ఏండ్ల పాటు గోసపెట్టిన ప్రతిపక్ష పార్టీలను ఈ ఎన్నికల్లో ఓటుతో పాతరబెట్టాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. కాంగ్రెస్ వైఖరి మూలంగానే నాడు తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు రావడంతో మాయమాటలు చెబుతూ ప్రజలను మోసగించేందుకు వస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలకు గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
నలబై ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో తనకు తోడు నీడలా ఉంటున్న రాయపర్తి మండలమే తన స్వస్థలంగా చెప్పుకుంటున్నానని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. తనకు జన్మనిచ్చిన పర్వతగిరి మండలం కంటే రాయపర్తి మండలమే తనకు కష్టసుఖాల్లో కాపాడిందని గుర్తు చేసుకున్నారు. డబ్బు సంచులతో వచ్చి ప్రజలను, నాయకులను అంగట్లో గొర్రెల్లా కొనుగోలు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న మోసకారులతో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలు ఈ ఎన్నికల్లో మరోమారు తనను ఆశీర్వదించి ఘన విజయం అందిస్తే పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి మరింతగా కృషి చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతానని హామీ ఇచ్చారు.
మండలంలోని రాగన్నగూడేనికి చెందిన కత్తి క్రాంతి తాను దాచుకున్న రూ.116ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు ఎన్నికల ఖర్చుల నిమిత్తం విరాళంగా అందజేశారు. అనంతరం జేతురాంతండాలో ప్రచార నిమిత్తం వస్తున్న ఎర్రబెల్లి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తున్న దళిత మహిళా రైతుతో మాట్లాడారు. దీంతో తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తన సద్ది బువ్వను మంత్రి ఎర్రబెల్లికి తినిపించింది. తండాల్లో నిర్వహించిన ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. ఒగ్గు డోలుతోపాటు డప్పు కళాకారులు, కోలాట బృందాల ఆటపాటలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా, పలు గ్రామాల కాంగ్రెస్, బీజేపీ నాయకులు మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్ల సుధీర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, మండల ఎన్నికల ఇన్చార్జి గుడిపూడి గోపాల్రావు, నాయకులు పూస మధు, మునావత్ సుజాత, కంది ప్రభాకర్, నేతావత్ కిషన్నాయక్, గుగులోత్ సుందర్నాయక్, బానోత్ శ్వేత-సుభాష్నాయక్, చిలుముల్ల ఎల్లమ్మ యాకయ్య, మొలుగూరి పున్నమయ్య, గుగులోత్ బీకోజీనాయక్, పెండ్లి రజనీ సుధాకర్రెడ్డి, ఆలకుంట్ల రాజేందర్, చిట్యాల వెంకటేశ్వర్లు, తోట నర్సింగం, లావుడ్యా చిరంజీవి, సూదుల దేవేందర్రావు, వేముల రమేశ్, కుందూరు రమేశ్రెడ్డి, మండల శ్రీధర్, మహ్మద్ అన్వర్ పాల్గొన్నారు.