హనుమకొండ, డిసెంబర్ 9 : దేశ సమైక్యత కోసం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. దిక్షా దివస్ కార్యక్రమం విజయవంతం కావడంతో పాటు టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మారేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం హనుమకొండ అశోకా హోటల్లో చీఫ్ విప్ విలేకరులతో మాట్లాడారు. ఉద్యమనేత కేసీఆర్ చేపట్టిన దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. గాంధేయ మార్గంలో సాధించిన తెలంగాణలో 8 సంవత్సరాలుగా అంబేద్కర్ ఆలోచనల మేరకు పాలన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించి గమ్యాన్ని ముద్దాడి…. నేడు సమాఖ్య స్ఫూర్తితో బీఆర్ఎస్గా మారి అధినేత కేసీఆర్ సారథ్యంలో ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్కు రాజ ముంద్ర పడటం శుభ పరిణామం అన్నారు.
ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశానన్నారు. ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని పెంపొందించేందుకు 11 రోజుల పాటు దిక్షా దివస్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగబద్ధంగా అధికారంలోకి వచ్చిన రాష్ర్టాల్లో బీజేయేతర ప్రభుత్వాలను కూలదోసిన చరిత్ర బీజేపీదన్నారు. అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసినవారే బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగుతున్న రాష్ర్టాన్ని అస్థిరపరచాలని కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే షర్మిల, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల లాంటి విచ్ఛిన్నకర శక్తులతో రాష్ట్రంలో బీజేపీ కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, అలాంటి విచ్ఛిన్నకర శక్తుల కుట్రలు, కుతంత్రాలను తరిమికొడుతారని స్పష్టం చేశారు. వీరి సమైక్య నినాదం వెనుక బీజేపీ కుట్ర ఉందన్నారు. దేశ ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్న బీజేపీపై వ్యతిరేకంగా పోరాటం చేస్తాం అన్నారు. కార్పొరేట్ శక్తులకు రూ.14 లక్షల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర బీజేపీది అని చీఫ్ విప్ విమర్శించారు. కర్షక, కార్మిక లోకం ఉసురు పోసుకుంటున్న బీజేపీ ప్రభుత్వాన్ని త్వరలోనే ప్రజలు ఇంటికి పంపుతారన్నారు.
కేసీఆర్ పాలనను దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. వారి హక్కుల కోసం పోరాటం చేస్తే కేసులు నమోదు చేస్తూ, కేంద్ర మంత్రి కుమారుడు వారిని వాహనాలతో తొక్కించిన సందర్భాలున్నాయన్నారు. తెలంగాణలో బీజేపీ వదిలిన బాణాలు గురితప్పి తిరుగుతున్నాయని తెలిపారు. ఆంధ్రా యాత్రికులు తెలంగాణలో విషయాత్రలు చేస్తే సరిహద్దు వరకు తరిమి తరిమి కొట్టడం ఖాయం హెచ్చరించారు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు అమలు చేసే వరకు కలిసి వచ్చే వారితో పోరాటం చేస్తామని చీఫ్ విప్ స్పష్టం చేశారు. రాష్ట్రంపై అర్థరహిత, ఉచిత సలహాలు అందిస్తున్న ఆంధ్రా వైసీపీ నాయకుల వ్యాఖ్యలు హాస్యాస్పదమని పేర్కొన్నారు. దీక్షాదివస్ ముగింపు కార్యక్రమం విజయ్ దివస్ను తాతాలికంగా వాయిదా వేశామని, తేదీని మళ్లీ ప్రకటిస్తామని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పేర్కొన్నారు. సమావేశంలో కూడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, రాష్ట్ర రైతు రుణవిమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.