ఎండిన పంటలకు రూ.25వేల నష్టపరిహారం ఇవ్వాలని, గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు పెట్టి మద్దతు ధరతో పాటు కాంగ్రెస్ ఇస్తామన్న క్వింటాల్కు రూ.500 బోనస్ అందించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఉమ్మడి జిల్లాలో కలెక్టర్లకు మంగళవారం వినతిపత్రాలు అందించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, హరిప్రియ నాయక్, శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, ములుగు జడ్పీ అధ్యక్షురాలు నాగజ్యోతి, జనగామ జడ్పీ, మున్సిపల్ చైర్పర్సన్లు గిరబోయిన భాగ్యలక్ష్మి, పోకల జమున వినతిపత్రాలు అందించి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి పాలన రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. షెడ్యూల్ ప్రకారం నీళ్లు విడుదల చేయక పంటలు ఎండి రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన చెందారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎప్పుడూ రైతుల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు.