జయశంకర్ భూపాలపల్లి. ఆగస్టు 4(నమస్తే తెలంగాణ)/మహదేవ్పూర్ : కరువుతో రైతులు విలపిస్తుంటే వారి కన్నీళ్లు చూస్తూ ఊరుకోం.. కాళేశ్వరం లక్ష్మీ పంప్హౌస్లో మోటర్లను మీరు రన్ చేస్తరా.. మమ్మల్ని చేయమంటరా అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. సోమవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందం కాళేశ్వరంలోని లక్ష్మీ పంప్హౌస్ను సందర్శించారు.
మాజీ ఎంపీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో పాటు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు విద్యాసాగర్, కోరుకంటి చందర్, రసమయి బాలకిషన్, నడిపెల్లి దివాకర్రావు, సుంకె రవిశంకర్, దాసరి మనోహర్రెడ్డి, బీఆర్ఎస్ నేత చల్మెడ లక్ష్మీ నర్సింహారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, జడ్పీ మాజీ చైర్పర్సన్లు దావ వసంత, జక్కు శ్రీహర్షిణి, సింగిల్విండో మాజీ అధ్యక్షుడు రమణారావు, మహదేవపూర్, పలిమెల బీఆర్ఎస్ మండలాధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్రావు, జవ్వాజి తిరుపతి, బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కేదారి గీత, మాజీ సర్పంచ్లు శ్రీపతిబాపు, లక్ష్మారెడ్డి,
వసంత మోహన్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జక్కు రాకేశ్, అన్కారీ ప్రకాశ్, పెండ్యాల మనోహర్, అడప సమ్మయ్య, యూత్ అధ్యక్షుడు ఎండీ అలీం ఖాన్, బీఆర్ఎస్ నాయకులు రత్నం అవినాష్, కుమార్, కార్యకర్తలు సహా సుమారు 500మంది లక్ష్మీ పంప్హౌస్కు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంప్హౌస్లో వెంటనే మోటర్లు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరదను పరిశీలించారు.
కన్నెపల్లి(లక్ష్మి) పంప్హౌస్ నుంచి నీటిని లిప్టు చేసి రిజర్వాయర్లు, చెరువులు నింపే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ ప్రభుత్వం కావాలని కుట్రలు చేస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. వారం రోజులు గడువు ఇస్తున్నాం.. ఈ లోగా మోటర్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించకపోతే కేటీఆర్, హారీశ్రావు ఆధ్వర్యంలో లక్షలాది మంది రైతులతో పంప్హౌస్ను ముట్టడించి మోటర్లను ఆన్ చేస్తామని స్పష్టంచేశారు. మేడిగడ్డ బరాజ్ గేట్లు మూయకున్నా కన్నెపల్లి వద్ద ప్రస్తుతం ప్రాణహిత ప్రవాహం సుమారు లక్షా నలభైవేల క్యూసెక్కులు వస్తున్నదని, ఈ నీటిని పంపు చేయడం ద్వారా ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న చెరువుల్లో నీళ్లు లేవని, సాగునీటి కోసం వానల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఒక ఫిల్లర్ కుంగితే ప్రాజెక్టునే పక్కన పెట్టి కేసీఆర్ను బద్నాం చేయడానికి ప్రభుత్వం చాలా కష్టపడుతున్నదని మాజీ ఎంపీ వినోద్కుమార్ మండిపడ్డారు. మేడిగడ్డ బరాజ్లో ఒక ఫిల్లర్ కుంగినా లక్ష్మి పంప్హౌజ్ ద్వారా నీటిని లిప్టు చేసి చెరువులు, రిజర్వాయర్లు నింపవచ్చు ఈ విషయం తెలిసినా ప్రభుత్వం కావాలనే కుట్రలు చేస్తున్నదన్నారు. మేడిగడ్డ బరాజ్ నుండి రోజూ 10 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతున్నదన్నారు. ఉత్తమ్, రేవంత్లకు ప్రాజెక్టులపై ఏ మాత్రం అవగాహన లేదని, కేసీఆర్ను బదునాం చేయడమే వారికి తెలిసిన విద్య అని అన్నారు. ఎన్డీఎస్ఏ బరాజ్ను కట్టుకోమని చెప్పినా ప్రభుత్వం కమిటీల పేరుతో కావాని కాలయాపన చేస్తుందన్నారు.
పంప్హౌస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకొంది. బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు భారీ చేరుకోవడంతో పంప్హౌస్లోకి పోలీసులు అనుమతించలేదు. ఈ క్రమంలో పోలీసులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో పార్టీ కార్యకర్తలు పంప్హౌస్ గేటు వద్దకు వచ్చి లోపలికి వెళ్లి మోటర్లను ఆన్ చేసేందుకు ప్రయత్నించారు. డీఎస్పీ సూర్యనారాయణరావు, సీఐ రాంచంద్రారావు ఆధ్వర్యంలో సిబ్బంది పంప్హౌస్ గేటు వద్ద బందోబస్తుతో శ్రేణులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొప్పుల ఈశ్వర్, వినోద్కుమార్, పుట్ట మధులు డీఎస్పీతో వాగ్వాదానికి దిగి గేటు వద్ద బైఠాయించారు. అనంతరం ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్తో ఫోన్లో మాట్లాడారు. పంప్హౌస్ ద్వారా నీటిని పంపింగ్ చేసే అవకాశం ఉన్నా నీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వారం రోజులు గడువు ఇస్తున్నాం.. ఈలోగా పంపింగ్ చేయకపోతే రైతులతో కలిసి వస్తాం.. మోటర్లు ఆన్ చేస్తం అని స్పష్టంచేశారు.
కన్నెపల్లి వద్ద లక్షల క్యూసెక్యుల నీరు వృథాగా పోతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతలకు సాగు నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్తోనే గతంలో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయని, తెలంగాణ సస్యశ్యామలం అయిందని గుర్తుచేశారు. కేసీఆర్ ముందుచూపుతో నిర్మించిన ప్రపంచంలోనే అద్భుత ప్రాజెక్ట్ కాళేశ్వరం అని అన్నారు.
నేడు కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యానికి రైతులు బలవుతున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లతో సాగునీరే కాక మత్స్య సంపద పెరిగి వేలాది మందికి జీవనోపాధి లభించిందన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కుటుంబం 40సంవత్సరాలు పాలించి నియోజకవర్గంలో కనీసం చెక్డ్యాం సైతం నిర్మించలేదన్నారు.అన్నారం బరాజ్ వద్ద గేట్లు ఎత్తడంతో ఎల్ఎండీ ఇతర వాగుల నుండి వచ్చిన నీరు వృథాగా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నారం, సుందిళ్ల బరాజ్లలో నీరు ఆపే పరిస్థితులున్నా కావాలని కుట్ర చేస్తున్నారన్నారు. గంగ ఒడ్డున ఉండి చేప దూపకు ఏడ్చినట్లు మంథని నియోజకవర్గ ప్రాంత రైతుల పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కన్నెపల్లి మోటర్లను ఆన్ చేసి రైతాంగానికి సాగు నీరు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
నాడు కేసీఆర్ సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోనే తెలంగాణ అన్నపూర్ణ రాష్ట్రంగా మారిందని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భ జలాలు పెరిగాయని, రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే ఎస్సారెస్పీలో పుష్కలంగా నీళ్లు వచ్చాయన్నారు. కాళేశ్వరంపై ఎన్ని కమిషన్లు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా పటాపంచలు చేస్తూ రైతుల పక్షాన ముందుకు సాగుతామని తెలిపారు. రైతాంగానికి అండగా ఉంటూ కాంగ్రెస్ అబద్ధాల పాలనను, కుట్రలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఈ నెల 8న కరీంనగర్లో జరుగబోయే బీసీ గర్జన సభలో 42శాతం బీసీ రిజర్వేషన్పై కాంగ్రెస్ ప్రభుత్వం ఆడే డ్రామాను ప్రజలకు తెలియజేస్తామన్నారు.