తొర్రూరు, మార్చి 22: పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి తొర్రూరు మండలం హరిపిరాల, కరాల గ్రామాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను బుధవారం ఉగాది పండుగ రోజు పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు. వడగళ్ల వానతో రైతులకు భారీ నష్టం కలగడం బాధ కలిగిస్తోందని తెలిపారు. పంటలు చేతికి వచ్చే సమయంలో వడగళ్లు కురిశాయని పేర్కొన్నారు. రైతులు వచ్చి తమను ఆదుకోవాలని కోరగా ఓదార్చి భరోసా కల్పించారు. ఇది రైతు ప్రభుత్వం, కేసీఆర్ రైతుల పక్షపాతి, రైతుల కోసం దేశంలో ఎకడా లేనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఉత్పత్తులను కూడా కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తారని భరోసా ఇచ్చారు.
రైతులు అధైర్య పడొద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారని, ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ సమీక్షిస్తున్నారని తెలిపారు. నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలను ప్రభుత్వానికి పంపే పనిలో ఉన్నారని వివరించారు. ఏ ఒక్క రైతు నష్టపోకుండా నివేదికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆర్డీవో రమేశ్, వ్యవసాయశాఖ అధికారి చత్రునాయక్, ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, సర్పంచ్ సెగ్యం సురేఖా సురేందర్, ఎంపీటీసీ వల్లపు గోపమ్మా మల్లయ్య, కో ఆప్షన్ సభ్యుడు షేక్ అంకుస్, ఉప సర్పంచ్లు చెంచర్ల రాజు, పసులాది వెంకన్న, కొండ వెంకన్న, తహసీల్దార్ నాగేంద్రప్రసాద్, ఏఏఓ కుమార్యాదవ్, ఏఈఓ అరవింద్ పాల్గొన్నారు.