ములుగు, జూలై 7 (నమస్తేతెలంగాణ) : రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ర్టాల్లో గిరిజన యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విభజన బిల్లులో చట్టాన్ని పొందుపర్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు, తొమ్మిదేళ్లుగా తెలంగాణపై వివక్ష చూపుతూ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయకుండా దాటవేస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో నాలుగేళ్ల క్రితమే ఏర్పాటు చేసింది. తెలంగాణలో ఏర్పాటుకు 300 ఎకరాల ప్రభుత్వ భూమి, తరగతుల నిర్వహణకు తాత్కాలిక భవనాన్ని అందుబాటులోకి తెచ్చి అప్పగించాలని 2017లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచించింది. దీంతో ములుగు జిల్లాలో ప్రభుత్వ స్థలంతో పాటు తరగతుల నిర్వహణకు భవనాన్ని అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం లేఖ ద్వారా తెలియజేసింది. ఈ క్రమంలో ములుగు జిల్లా గట్టమ్మ ఆలయం ఎదుట 337 ఎకరాల ప్రభుత్వ, అటవీ శాఖ భూములను సేకరించి 2018లో కేంద్ర మానవ వనరుల శాఖకు అప్పగించింది. అదే సంవత్సరంలో కేంద్రం నుంచి ప్రత్యేక బృందం ములుగుకు చేరుకొని ప్రభుత్వ స్థలాన్ని, తరగతుల కోసం జాకారంలో కేటాయించిన వైటీసీ భవనాలను పరిశీలించి యూనివర్సిటీ ఏర్పాటుకు అనువైనవిగా ఉన్నాయని ధ్రువీకరించింది. అయినా మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు యూనివర్సిటీని ఏర్పాటు చేయలేదు.
తొమ్మిదేళ్లుగా అమలు కాని హామీ
యూనివర్సిటీ విషయంలో బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే ఇప్పటి వరకు ఎంతో మంది గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందే వారు. కాని తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మార్లు విజ్ఞప్తులు చేసినా, పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. గత రెండు బడ్జెట్లలో అరకొర నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పినా విడుదల చేయలేదు. దీంతో కేటాయించిన స్థలంలో ఎలాంటి నిర్మాణాలు, అభివృద్ధి పనులు చేపట్టలేదు. అయినా తెలంగాణ సర్కారు జిల్లా యంత్రాంగాన్ని పురమాయించి సదరు స్థలంలో హద్దు రాళ్లను, ప్రహరీ నిర్మాణానికి పిల్లర్లను నిర్మించింది. నాలుగేళ్లుగా స్థలాన్ని సంరక్షిస్తూ వస్తున్నది. ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ పలు మార్లు పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయంపై కోరినా మోదీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నది.
ములుగులో నేడు నిరసనలు
గిరిజన యూనివర్సిటీపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా ప్రధాని మోదీ చేపట్టిన వరంగల్ పర్యటన సందర్భంగా నిరసన గళాన్ని వినిపించాలని బీఆర్ఎస్, ప్రజా సంఘాలు, గిరిజన సంఘాల నాయకులు నిర్ణయించారు. ఈ మేరకు నేడు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ నేతృత్వంలో ములుగులోని గాంధీ పార్క్ వద్ద ఉదయం 8గంటల నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేయనున్నారు. ప్రజా సంఘాలు, గిరిజన సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలతో వివిధ రూపాల్లో నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు.
మోదీ పర్యటనకు బీఆర్ఎస్ దూరం
ఈ క్రమంలో కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టత ఇవ్వకుండా వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఈ మేరకు శుక్రవారం సంయుక్త ప్రకటన జారీ చేశారు. ‘తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని బలంగా డిమాండ్ చేశారు. దీంతో 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని పొందుపరిచారు. తొమ్మిదేండ్లుగా కేంద్రం నుంచి గాని, ప్రధాని మోదీ నుంచి గాని ఎలాంటి స్పందన రాలేదు. విభజన చట్టం హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకసార్లు ప్రధానమంత్రిని కలిసి రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఎన్నిసార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదు. నామమాత్రపు చర్యగా రైల్వే వ్యాగన్ పీరియాడిక్ ఓవర్హాల్ (పీవోహెచ్)ను ఏర్పాటు చేస్తామని కేంద్రం చెప్పింది. దీనికి కావాల్సిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి రైల్వే శాఖకు అప్పగించింది.
ఇప్పుడు బీజేపీ సర్కారు పీవోహెచ్ను వ్యాగన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్గా మార్చి తెలంగాణను, ముఖ్యంగా వరంగల్ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నది. దేశంలో ఎక్కడా కొత్తగా కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేది లేదని స్వయంగా పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణను మోసం చేస్తూ మహారాష్ట్ర, గుజరాత్లకు కొత్తగా కోచ్ ఫ్యాక్టరీలను మంజూరు చేసి నిర్మిస్తున్నది. విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఇప్పటికైనా ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. ప్రధాని మోదీ వరంగల్ వస్తున్న సందర్భంగా దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాం. కోచ్ ఫ్యాక్టరీ విషయంలో బీజేపీ మోసపూరిత, నిర్లక్ష్య, వైఖరికి నిరసనగా శనివారం వరంగల్లో జరిగే ప్రధాని కార్యక్రమానికి భారత రాష్ట్ర సమితి హాజరుకావడంలేదు. ప్రధాని పర్యటన ప్రభుత్వ కార్యక్రమమే అయినా బీజేపీ పూర్తిగా దీన్ని పార్టీ వ్యవహారంలా చేస్తున్నది. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా తెలంగాణను, ఇక్కడి ప్రజలను పూర్తిగా విస్మరించింది. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఇప్పుడు తెలంగాణ ప్రజలు గుర్తుకువచ్చి మరోసారి మోసం చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ వరంగల్కు వస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఇలాంటి తెలంగాణ వ్యతిరేక చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుంది.’ అని ప్రకటనలో పేర్కొన్నారు.