లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ నుంచి ఖమ్మం బయల్దేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గమధ్యంలో ప్రజలను పలుకరిస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకొంటూ ముందుకుసాగారు. ఆదివారం హనుమకొండ చౌరస్తాలో రోడ్షో ముగించుకొని రాత్రి మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంట్లో బస చేసిన ఆయన సోమవారం సాయంత్రం హనుమకొండ, వర్ధన్నపేట, రాయపర్తి, ఐనవోలు మీదుగా మహబూబాబాద్ జిల్లాకు చేరుకొని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి తొర్రూరు, మరిపెడ మండలకేంద్రాల్లో కొద్దిసేపు ఆగారు. అప్పటికే అక్కడికి చేరుకున్న నాయకులు, ప్రజలు, అభిమానులు అభిమాన నేతకు ఎదురేగి పూలు, రంగు కాగితాలు చల్లుతూ మంగళహారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. బస్సు వెంట నడుస్తూ జై కేసీఆర్ అంటూ నినదించగా కేసీఆర్ వారికి అభివాదం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎల్లంపేట స్టేజీలోని సయ్యద్ సోంద్ హోటల్ వద్ద ఆగి పకోడీలు, మిర్చిలు తిని, చాయ్ తాగిన కేసీఆర్.. యజమానితో ముచ్చటించారు. అలాగే, అక్కడికి వచ్చిన ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ‘మీరు లేకుంటే ఆగమైంది సారు.. తాగు, సాగునీటికి గోసపడుతున్నా’మని గోడు వెల్లబోసుకున్నారు. వారి సమస్యలను ఓపిగ్గా విన్న కేసీఆర్ మనకు మంచిరోజులొస్తాయ్.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి వారికి బుద్ధి చెప్పాలని కోరుతూ ఖమ్మం వైపు కదిలారు.
పెద్దవంగర(తొర్రూరు)/నర్సింహులపేట/మరిపెడ, ఏప్రిల్ 29 : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లాకు వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర సోమవారం సాయంత్రం తొర్రూరు చేరగా జనం, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పాలకేంద్రం నుంచి బస్టాండ్ చౌరస్తా వద్ద వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై పెద్దఎత్తున కేసీఆర్ బస్సులో నుంచే కేసీఆర్ ప్రజలు, పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. జై తెలంగాణ.. జై జై తెలంగాణ.. అమర వీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. రోడ్ షోకు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్కుమార్ కారు గుర్తుకే ఓటు వేయాలని నినాదాలు చేశారు. అనంతరం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్థానిక నాయకులను కేసీఆర్కు పరిచయం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సులో ఖమ్మం వెళ్తున్న కేసీఆర్ మరిపెడ మండలంలోని ఎల్లంపేట స్టేజీ వద్ద హోటల్లో టీ తాగి వెళ్తున్న క్రమంలో రైతు గుగులోత్ జ్యోతి తన సమస్యలను చెప్పుకొంది.
గుగులోత్ జ్యోతి : సార్ నమస్కారం
కేసీఆర్ : నమస్కారం చెప్పమ్మా
జ్యోతి : నా పొలం పట్టా కాలేదుసార్
కేసీఆర్ : ఎన్ని ఎకరాలు?
జ్యోతి : మూడు ఎకరాలు సార్. యాసంగి రెండు ఎకరాలు వరి పొలం సాగు చేస్తే నీళ్లు రాక ఎకరం ఎండిపోయింది సార్.
కేసీఆర్ : ఎస్సారెస్పీ ద్వారా కాల్వలో నీరు రాలేదా?
జ్యోతి : వారం తప్ప వారం నీళ్లు వదిలినారు సార్. మార్చి మధ్యనే నీళ్లు ఆపడంతో ఎకరం ఎండిపోయింది సార్
కేసీఆర్ : మంచి రోజులు వస్తాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసి వాళ్లకు బుద్ధి చెప్పాలి.
జ్యోతి : పట్టా కాకపోవడానికి కారణంపై ఫోన్ నంబర్ తీసుకున్నారు. తర్వాత సార్ పీఏ భూమికి సంబంధించిన వివరాలు తీసుకున్నారు.
బస్సుయాత్ర మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజీ వద్ద సయ్యద్ సోంద్ హోటల్ వద్ద ఆగింది. బస్సు నుంచి దిగిన కేసీఆర్ యజమాని సయ్యద్ సోంద్తో మాట్లాడారు. పిల్లలు ఎంతమంది?, ఏం చదువుతున్నారు? హోటల్తో ఉపాధి ఎలా గడుస్తుంది? అని అడిగి తెలుసుకున్నారు. గారెలు, పకోడీలు, బజ్జీలు తిని టీ తాగి.. సాయబ్ రుచిగా ఉన్నాయంటూ కితాబిచ్చారు. హోటల్ వద్ద ఆగిన కేసీఆర్ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం చేరుకున్నారు. కొందరు చిన్నారులు, యువతులు కేసీఆర్తో కరచాలనం చేశారు. అనంతరం అక్కడ ఉన్న జనంతో మమేకమై వారితో ఆప్యాయంగా మాట్లాడారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.
నర్సింహులపేట, ఏప్రిల్ 29: కేసీఆర్ సార్ మా హోటల్ దగ్గర ఆగడం మస్తు సంతోషంగా ఉంది. మా హోటల్లో గారెలు, బజ్జీలు, పకోడీలు తిన్నారు. టీ చేయమని అడిగారు. ఇక్కడ పొజిషన్ ఎలా ఉంది అని అడిగారు. 20 మందికి టీ చేసి పోసిన. మీరు సీఎంగా ఉన్నప్పుడు 24గంటలు నీళ్లు వచ్చేది. ఇప్పుడు ఒకరోజు తప్ప ఒకరోజు వస్తుంది. బాగ తిప్పలయితాంది అని చెప్పిన. మీరు సీఎంగా లేనందుకు బాధనిపిస్తుంది అని చెప్పిన. హోటల్ గిరాకీ ఎంత వస్తుంది అని అడిగారు. రూ. 4000 వస్తుందని చెప్పాను. పిల్లలు ఎంత మంది, ఏం చదువుతున్నారు అని అడిగారు. ఇద్దరు పిల్లలు సార్ అని చెప్పిన. ఇంటర్ చదువుతున్నారని చెప్పిన.. పాసయ్యారా అని అడిగారు. ఇద్దరు పాసైనారు అని చెప్పిన. కంగ్రాట్స్ చెప్పారు. సార్ వెళ్తున్న సమయంలో రూ. 500 ఇచ్చారు. వద్దు సారు మీరు మా హోటల్కు రావడమే అదృష్టం అని చెప్పినా పర్వాలేదు ఉంచుకోండి అని ఇచ్చారు. రూ. 500 సార్ గుర్తుగా దాచుకుంటున్నా.
కాంగ్రెస్ పాలనలో మార్పు వచ్చిందా?, ఎస్సారెస్పీ నుంచి సాగు నీరు వస్తుందా?, రైతుబంధు వచ్చిందా?, రుణమాఫీ అయిందా? పంటకు మద్దతు ధర ఉందా? బోనస్ ఇచ్చారా? అని ప్రజలను అడుగగా, వారు ఏమీ లేదు సార్.. సాగునీళ్లు లేవు, రైతుబంధు రాలేదు, రుణమాఫీ కాలేదు., బోనస్ రూ.500 ఇవ్వలేదని రైతు గుగులోత్ రెడ్డితోపాటు అక్కడే ఉన్న కొండ్లె శ్రీనివాస్ కేసీఆర్కు వివరించారు.
కేసీఆర్ బస్సుయాత్ర మరిపెడ మున్సిపల్ కేంద్రానికి చేరుకోగానే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తమ అభిమాన నేతకు డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్రావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పూలుచల్లి ఘనస్వాగతం పలికారు. బీఆర్ఎస్ మానుకోట పార్లమెంట్ అభ్యర్థి, జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత కేసీఆర్కు మంగళహారతితో స్వాగతం పలికారు. దిష్టిగుమ్మడి కొట్టారు. కాగా, జననేతను చూసేందుకు వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి పొడవునా సుమారు రెండు కిలోమీటర్ల మేర జనం బారులు తీరారు. తమ అభిమాన నేతను చూసి మురిసిపోయారు. అధినేత రాకతో బీఆర్ఎస్ శ్రేణులు ఉప్పొంగిపోయారు.
కల్యాణలక్ష్మి వస్తుందా?, తులం బంగారం ఇచ్చారా?, మహిళలకు రూ.2500 ఇచ్చారా? పింఛన్ రూ.4000 వస్తుందా అని మహిళలను అడుగగా, ఏమి లేదుసార్ అని వారు బదులిచ్చారు. ‘మీరు లేక అంతా ఆగమైపోయింది సార్. మాయమాటలు నమ్మి మోసపోయినం, ఇట్లయితది అనుకోలే. మళ్లీ మీరే రావాలె సారు. ఎండాకాలంల తాగు, సాగునీరు లేక ఇబ్బందిపడుతున్నాం’ అంటూ కేసీఆర్కు గోస చెప్పుకున్నారు.