శాసనసభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలను ఓట్లడుగుతున్నారు. పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపర్చిన అంశాలపై ప్రచారం చేస్తూ కారు గుర్తుకు ఓటేయాలని కోరుతుండడంతో అపూర్వ స్పందన లభిస్తున్నది. పాలకుర్తి, జనగామ, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పల్లా రాజేశ్వర్రెడ్డి, కడియం శ్రీహరికి మద్దతుగా ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలకు ప్రణాళిక రూపొందించారు. ఈనెల 14న తొర్రూరు (పాలకుర్తి), 18న చేర్యాల (జనగామ), 20న స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగే బహిరంగ సభలకు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతుండడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.
జనగామ, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : నామినేషన్ల పర్వం ఊపందుకున్న నేపథ్యంలో జనగామ జిల్లాలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇటీవల కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి సీనియర్ నేతలంతా బీఆర్ఎస్లో చేరడం..మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని కీలక సభలకు గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానుండడంతో ఆసక్తికరంగా మారింది. పాలకుర్తి, జనగామ, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి మద్దతుగా ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈనెల 14న తొర్రూరు (పాలకుర్తి), 18న చేర్యాల (జనగామ), 20న స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో కేసీఆర్ సభలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. 10న పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు రెండోసెట్ నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించే భారీ ఎన్నికల బహిరంగసభకు మంత్రులు తన్నీరు హరీశ్రావు, సత్యవతిరాథోడ్ రానున్నారు. ఇప్పటికే గత నెల 16న జనగామలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొనడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. నెలరోజుల వ్యవధిలోనే తిరిగి ఇదే నియోజకవర్గం పరిధిలోని సిద్ధిపేట జిల్లా చేర్యాల పట్టణంలో ఎన్నికల ప్రచార సభకు అధినేత కేసీఆర్ రానున్నారు. తెలంగాణ జిల్లాల ఎన్నికల ప్రచార పర్యటనకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ ఒకే నియోజకవర్గంలో రెండు సభలు నిర్వహించడం విశేషం.
పాలకుర్తి నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు ఉన్న మహబూబాబాద్ జిల్లా పరిధిలోని తొర్రూరు పట్టణంలో ఈనెల 14న జరిగే ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొంటారు. అభ్యర్ధి కడియం శ్రీహరికి మద్దతుగా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఈనెల 20న జరిగే ప్రజా ఆశీర్వాద సభలో అధినేత పాల్గొంటారు. ఒకేసారి 115 మంది అభ్యర్ధులను ప్రకటించి దమ్మున్న పార్టీ అధినేతగా మరోసారి నిరూపించిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉరిమే ఉత్సాహంతో ఎన్నికల సమరాంగణంలో ప్రచార వేగాన్ని పెంచారు. అధినేత సభలను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ జిల్లా శ్రేణులు ఇప్పటికే రంగంలోకి దిగాయి. సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ, భారీగా జన సమీకరణ చేసేందుకు దిశానిర్దేశం చేస్తున్నాయి. మరోవైపు గులాబీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తుంటే అభ్యర్ధుల ఖరారుకు ప్రతిపక్ష పార్టీలు ఇంకా పూర్తిస్థాయిలో సర్దుకోలేక ఢీలా పడుతున్నారు. జనగామలో మాజీ మంత్రి పొన్నాల, పాలకుర్తిలో ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి, అల్లం ప్రదీప్రెడ్డి వంటి సీనియర్లు కాంగ్రెస్కు గుడ్బై చెప్పి గులాబీ కండువాలు కప్పుకోవడంతో బీఆర్ఎస్కు కొత్త ఊపు వచ్చింది. తాజాగా జనగామకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు బక్క నాగరాజు, డాక్టర్ మాచర్ల భిక్షపతి సైతం గులాబీ పార్టీలో చేరారు. కోట్లకు అసెంబ్లీ సీట్లు అమ్ముకుంటున్న టీ-పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై సొంత పార్టీ నేతలే బహిరంగ విమర్శలు చేస్తుండడంతో కాంగ్రెస్ శ్రేణులు అసహనంతో ఉన్నాయి.
బీఆర్ఎస్ అభ్యర్ధులు ప్రచారంలో ముందున్నారు. కార్యకర్తలు నాయకులతో సమావేశాలు, కుల సంఘా లు, మతపెద్దలతో ఆత్మీయ సమ్మేళనాలు, సభలు నిర్వహిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోపక్క పార్టీ శ్రేణులు గ్రామాలు, పట్టణ వార్డుల్లో గడపగడపకూ వెళ్లి అభ్యర్థుల తరపున ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్ సర్కారు తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తుచేస్త్తూ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన వివిధ కొత్త పథకాలు, రైతుబంధు, పింఛన్ల మొత్తం పెంపు వంటి అంశాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి ప్రజలు, మహిళలు, లబ్దిదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. పాలకుర్తిలో దయాకర్రావు, జనగామలో పల్లా రాజేశ్వర్రెడ్డి, స్టేషన్ఘన్పూర్లో కడియం శ్రీహరికి అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారు. ఇప్పటికే పాలకుర్తిలో దయాకర్రావు, ఆయన సతీమణి నామినేషన్ దాఖలు వేయ గా, మంగళవారం జనగామలో పల్లా రెండుసెట్ల నామినేషన్లు వేశారు. గురువారం స్టేషన్ఘన్పూర్లో అభ్యర్థి కడియం శ్రీహరి నామినేషన్ వేయనున్నారు.