అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తుండడంతో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది. మరోవైపు గ్రామాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ మమేకమవుతున్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతోపాటు రానున్న ఐదేళ్లలో అమలు చేసే అంశాలపై కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. కారు ప్రచార జోరులో ఉండగా, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు డీలాపడుతున్నారు. జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. శుక్రవారం చేర్యాల పట్టణంలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, తాటికొండతోపాటు పల్లా కుటుంబ సభ్యులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగిస్తున్న అభ్యర్థులు ఎర్రబెల్లి దయాకర్రావు, కడియం శ్రీహరికి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు.
జనగామ, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, వచ్చే ఐదేళ్లలో అమలు చేసే అంశాలపై విడుదల చేసిన మ్యానిఫెస్టోపై ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ వివరిస్తున్నారు. ఓటర్లను కలిసి కారు..సారు..కేసీఆర్ నినాదంతో ముందుకుపోతున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు, గ్రామ, మండల, నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలతో విస్తృత ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల కుటుంబ సభ్యులు సైతం ఎన్నికల ప్రచారంలో భాగస్వాములవుతూ తమదైన శైలిలో ప్రచారంలో ముందున్నారు. సోషల్ మీడియాలో ప్రత్యర్ధి పార్టీల నాయకుల మాటలకు దీటుగా సమాధానం చెబుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూపుతూ ఎన్నికల క్షేత్రంలో సై అంటే సై అంటూ సవాల్ విసురుతున్నారు. కారు ప్రచార జోరును కొనసాగిస్తుంటే ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధులు ఢీలా పడుతున్నారు. జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల్లో అందరికంటే ముందే ఎన్నికల క్షేత్రంలోకి దిగిన బీఆర్ఎస్ పోలింగ్ సమీపిస్తుండగా ప్రచార దూకుడును పెంచింది. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో జెట్ స్పీడ్తో పరుగులు పెడుతుంటే..కారు టాప్ గేర్లో లక్ష్యం వైపు దూసుకుపోతున్నది.
ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ అభ్యర్ధులను ప్రకటించారు. అప్పటి నుంచే అభ్యర్ధులు రంగంలోకి దిగి నిరంతరం ప్రజలతో మమేకమవుతూ ఓట్లు అభ్యర్ధిస్తున్నారు. తమను ఆశీర్వదిస్తే రాబోయే ఐదేళ్లలో నియోజకవర్గాలను మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామంటూ వివిధ వర్గాలను, కుల సంఘాలను కలిసి మద్దతు కూడగడుతున్నారు. మూడు నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచి పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరికల పర్వం కొనసాగుతున్నది. కుల వృత్తులు, చాంబర్ ఆఫ్ కామర్స్ పరిధిలోని అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థల అసోసియేషన్లు, డాక్టర్లు, మెడికల్షాపు యజమానులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, రిటైర్డు ఉద్యోగుల, కాలనీ అసోసియేషన్లతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ మద్దతు కూడగడుతున్నారు. జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపునకు మాజీ మంత్రి పొన్నాల, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య సహా స్థానిక ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య వ్యూహా ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, అభ్యర్థి పల్లాతో కలిసి గ్రామాలు, పట్టణ వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జనగామ మున్సిపాల్టీ పరిధిలో ఇప్పటికే సగం వార్డుల్లో ఇంటింటి ప్రచారం పూర్తి చేశారు. శుక్రవారం చేర్యాల మున్సిపాల్టీ వార్డుల్లో ముత్తిరెడ్డి సహా పల్లా సతీమణి నీలిమ, కుమారుడు అనురాగ్రెడ్డి సహా కుటుంబ సభ్యులు ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశాలు, సమ్మేళనాలతో వ్యూహాత్మకంగా ముందుకుకెళ్తున్నారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో అభ్యర్ధి కడియం శ్రీహరి ఊరూరా ప్రచారం చేస్తూనే వివిధ పార్టీల నుంచి పెద్దఎత్తున చేరికలతో వారి మద్దతును కూడగడుతున్నారు. ఇప్పటికే పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు, స్టేషన్ఘన్పూర్లో కడియం శ్రీహరి గెలుపు ఖాయం కాగా, జనగామలో సీఎం సభ తర్వాత పల్లా గెలుపు ‘నలేరుపై నడకే’ అన్నది స్పష్టమైంది. ప్రచార కార్యక్రమాలతో గులాబీ శ్రేణులు అభ్యర్థులతో కలిసి గ్రామాలను చుట్టేస్తుంటే విపక్ష పార్టీల్లో ఆ సందడి కనిపించడంలేదు. ఇప్పటికే రెండుసార్లు గులాబీజెండా రెపరెపలాడిన జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ సెగ్మెంట్లలో హ్యాట్రిక్ దిశగా ముందుకెళ్తోంది.
జనగామ ప్రజా ఆశీర్వాద సభ తర్వాత గులాబీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొన్నది. సభ ఊహించిన దానికంటే సూపర్ డూపర్ సక్సెస్ కావడంతో అటు నాయకులు, ఇటు గ్రామస్థాయి కార్యకర్తల్లో నయా జోష్ నింపింది. మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతుబంధు ఎకరానికి రూ.16 వేలకు వచ్చే ఐదేండ్లలో క్రమంగా పెంపు, సౌభాగ్యలక్ష్మి పేరుతో బీపీఎల్ కుటుంబాలకు చెందిన అర్హులైన మహిళలకు కొత్తగా నెలకు రూ.3 వేల గౌరవ భృతిపై అన్ని వర్గాల్లో బీఆర్ఎస్పై విశ్వాసం పెరుగుతున్నది. అర్హులైన పేద కుటుంబాలకు రూ.400కే వంట గ్యాస్ సిలిండర్, కేసీఆర్ ఆరోగ్యరక్ష ద్వారా రూ.15 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులకు రూ.15 లక్షల వరకు నగదు రహిత వైద్యబీమా, పేద కుటుంబాలకు రూ.5 లక్షల కేసీఆర్ బీమా ధీమా కల్పిస్తున్నది. సన్నబియ్యం, ఆసరా పింఛన్లను రూ.5016కు పెంపును మార్చి నుంచి దశలవారీగా అమలు చేస్తామన్న బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు లబ్ధిదారులు జేజేలు పలుకుతున్నారు.
నాటి ఉద్యమంలో గులాబీజెండా గుండెగుండెనూ తాకితే..తొమ్మిదేండ్ల అభివృద్ధి, సంక్షేమంతో బంగారు తెలంగాణ వైపు సాగుతున్న బీఆర్ఎస్ పార్టీ గడపగడపకూ చేరువైంది. ఆదీ నుంచి అధినేత కేసీఆర్కు జైకొట్టిన జనగామ జిల్లా ప్రజలు 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు తిరుగులేని మెజార్టీ కట్టబెట్టింది. ఇక రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు అంతనంత దూరంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే.. బీజేపీ మాత్రం కనీస డిపాజిట్ కోల్పోతూ వస్తున్నది. బీఆర్ఎస్ క్షేత్రస్థాయి ప్రజానీకానికి చేరువ కావడం..నిత్యం కండ్లముందే కనిపిస్తున్న అభివృద్ధి..సంక్షేమ పథకాలు..రానున్ను ఐదేండ్లలో అమలు చేసేందుకు అధినేత ప్రకటించిన మ్యానిఫెస్టోను నమ్ముతున్న జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల ప్రజలు ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్కు పట్టం గట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జనగామలో డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి, స్టేషన్ఘన్పూర్లో కడియం శ్రీహరికి మునుపటి కంటే రెట్టింపు మెజార్టీ ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2018-2023 మధ్య ప్రతి నియోజకవర్గంలోనూ అంచనాలకు మించి అభివృద్ధి జరిగిందని..ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందాయని..అందుకే గతంలో కంటే ఈసారి అదనపు మద్ధతు ఉంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. జనగామలో ముత్తిరెడ్డి, పొన్నాల, స్టేషన్ఘన్పూర్లో రాజయ్య సహకారంతో కడియం గెలుపు ఖాయంగా కనిపిస్తుండగా..పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు ఓటమెరుగని నాయకుడిగా అధిక మెజార్టీతో జయకేతనం ఎగురవేసేలా ముందుకెళ్తున్నాడు.