వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 30 : మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ (ఎంజీఎంహెచ్)లో గురువారం తెల్లవారుజామున ఇనుప విద్యుత్ స్తంభం విరిగిపడింది. ఆస్పత్రి పార్కింగ్ ఏరియాలో ఉదయం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోగా, అక్క డ ఏవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ నేపథ్యంలో ఔట్ పేషెంట్(ఓపీ)తో పాటు ఫిజియోథెరపి, పారా మెడికల్ తదితర విభాగాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
విష యం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ స్తంభానికి అనుసంధానంగా ఉన్న ఇతర లైన్లకు సరఫరా నిలిపివేశారు. దీనివల్ల ఓపీ రిజిస్ట్రేషన్ విభాగంలో కంప్యూటర్లు పని చేయకపోవడంతో రోగులకు చేతిరాత ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించారు. లైట్లు, ఫ్యాన్లు లేక సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ఫిజియోథెరపీ, పారామెడికల్ విభాగాల్లో రోగులకు సేవలందలేదు.
ఈ స్తంభా చాలా కాలంగా ఒక వైపుకు ఒరిగిపోయినట్లుగా ఉందని, అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని, జనసంచారమున్న సమయంలో జరిగితే ప్రాణాపాయం కలిగేదని సిబ్బంది చెబుతున్నారు. స్తంభం తుప్పు పట్టడం, గాలి బలంగా వీచడంతోనే విరిగిపడినట్లు విద్యుత్ అధికారులు గుర్తించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు మరమ్మతు పూర్తిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఇప్పటికైనా ఆస్పత్రి ఆవరణలో ప్రమాదకరంగా ఉన్న స్తంభాలను తొలగించాలని వైద్యులు, రోగులు, అటెండెంట్లు కోరుతున్నారు.