కార్మికులకు ఏనాడూ రుణాలు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలు చేసిన లక్షల కోట్ల అప్పులను మాత్రం మాఫీ చేస్తున్నదని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ధ్వజమెత్తారు. కార్మికులకు పని గంటలు, కనీస వేతనం, ఉద్యోగ భద్రతపై బీజేపీ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండలో మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడా కార్పొరేట్లకు మోదీ సర్కారు తొత్తులా మారి కార్మికులు, కర్షకుల పొట్టకొడుతున్నదని విమర్శించారు. కేంద్రం వెంటనే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సఫాయి కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
– హనుమకొండ, ఆగస్టు 9
హనుమకొండ,ఆగస్టు బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షకుల హక్కులను కాలరాస్తోందని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆగ్రహించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహించే కార్మి క మహా ధర్నా బుధవారం ప్రారంభమైంది. హనుమకొండ కలెక్టరేట్ ముందున్న కపిల్ హౌస్ ఎదుట ఏర్పాటు చేసిన ధర్నా శిబిరంలో చీఫ్ విప్ పాల్గొని మాట్లాడుతూ రానున్న రోజుల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలు, బడాపారిశ్రామికవేత్తలకు తొత్తుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తొమ్మిదేళ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏనాడూ కార్మికులు, కర్షకుల పక్షాన నిలిచిన పాపానపోలేదన్నారు.
కార్మికుల పనిగంటలు పెంచుతూ చేసిన నల్లచట్టాలు కేవలం అంబానీ, అదానీల మేలుకోసమేనని చెప్పారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలైన రైల్వే, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, గ్యాస్ కంపెనీలను ప్రైవేట్ పరం చేసి లక్షల కార్మిక కుటుంబాలను రోడ్డున పడేస్తోందని పేర్కొన్నారు. కార్మికులకు ఏనాడూ రుణాలు ఇవ్వని కేంద్రం బడా పారిశ్రామికవేత్తలు దోపిడీ చేసిన వేల కోట్లను మాఫీ చేస్తోందని ధ్వజమెత్తారు. పనిగంటలు, కనీస వేతనం, ఉద్యోగ భద్రతపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వేతనాలు పెంచాలని అడిగిన కార్మికులపై గుర్రాలతో తొకించిన ప్రభుత్వాలు గతంలో కనిపించేవని, కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కార్మికులకు అండగా నిలుస్తున్నారని అన్నారు. నిరుపేదలు, కార్మికుల గురించి ఆలోచించేది సీఎం కేసీఆర్ ఒకరేనని పేర్కొన్నారు. సఫాయన్నా సలామన్నా నినాదంతో సఫాయి కార్మికులకు 30శాతం వేతనాలు పెంచింది తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. హోంగార్డులు, ఆశవరరు,్ల అంగన్వాడీ, సఫాయి కార్మికులకు వేతనాలు పెంచిన కార్మిక పక్షపాతి కేసీఆర్ అన్నారు.
భవన నిర్మాణ కార్మికులకు కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిందని, వారి పిల్లలకు ఉచితంగా చదువు, బిడ్డలు పుడితే సాయం, దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే కుటుంబానికి రూ.6లక్షల సాయం అందుతోందని వివరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటీకరణ ఆపివేయాలని డిమాండ్ చేశారు. పలువురు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో కార్మికులకు చేసిందేమీ లేదని, నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల పొట్టకొడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అమ్ముతూ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో బీజేపీని గద్దె దించేందుకు కార్మిక, కర్షక లోకమంతా ఒక్కతాటిపైకి రావాలని నాయకులు పిలుపునిచ్చారు. బీజేపీ, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాలో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందరరాజు యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్మిక నాయకులు పుల్ల శ్రీనివాస్, బీఆర్టీయూ నాయకులు నాయిని రవి, మల్లేశం, ఐఎన్టీయూసీ తోట భిక్షపతి, సీఐటీయూ ఉప్పలయ్య, ఐఎఫ్టీయూ కృష్ణ, టీఎన్టీయూసీ శ్యామ్ పాల్గొన్నారు.