కమలాపూర్, జనవరి 2: మండలంలోని ఉప్పల్ భీంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనాన్ని హెచ్పీ గ్యాస్ సిలిండర్ల లారీ సోమవారం సాయంత్రం ఢీకొంది. ఈ ఘటనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం దుబ్యాల గ్రామానికి చెందిన బిక్కినేని సంపత్రావు (65) మృతి చెందగా, ఆయన భార్య విజయ, కన్నూరుకు చెందిన మాట్ల సుమలతకు తీవ్రగాయాలయ్యాయి. పండ్లు అమ్ముతున్న అంజలి పరుగెత్తడంతో ప్రాణాలతో బయటపడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో బంధువు దశదినకర్మకు దుబ్యాలకు చెందిన బిక్కినేని సంపత్రావు, ఆయన భార్య విజయతో బైక్పై వచ్చి తిరిగి బయలుదేరారు. ఉప్పల్ శివారులోని భీంపల్లి క్రాస్ వద్ద పరకాల-హుజురాబాద్ ఫోర్లేన్ రహదారి దాటుతుండగా హుజురాబాద్ నుంచి కమలాపూర్ వైపు వస్తున్న హెచ్పీ గ్యాస్ సిలిండర్ల లారీ ఢీకొంది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంపత్రావు అక్కడిక్కడే మృతి చెందగా విజయకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా హుజురాబాద్ సివిల్ ఆసుపత్రిలో విధులు ముగించుకుని బస్సుకోసం వేచిఉన్న కన్నూరుకు చెందిన మాట్ల సుమలతకు తీవ్రగాయాలయ్యాయి. రోడ్డు పక్కనే పండ్ల బండిని ఢీకొట్టడంతో నుజ్జునుజ్జుయింది. లారీ వస్తున్న ప్రమాదాన్ని పసిగట్టిన చిరు వ్యాపారి అంజలి పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడింది. బాధితులు బిక్కినేని విజయ, మాట్ల సుమలతను 108 వాహనంలో చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదాలు
ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తూ మృతదేహంతో రహదారిపై ధర్నా చేపట్టారు. పరకాల-హుజురాబాద్ ఫోర్లేన్ రోడ్డు నిర్మాణం చేసినప్పడు ఒకేచోట ఉప్పల్-జమ్మికుంట రోడ్డు ఉండటంతో యూటర్న్ ఇవ్వలేదని, స్పీడ్ బ్రేకర్లు వేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపించారు. ఇప్పటికే రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయినా అధికారులు స్పందించడం లేదన్నారు. ప్రమాదకరంగా ఉన్న రహదారిని మూసివేసి యూటర్న్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు శవాన్ని తరలించేది లేదని రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి బంధువులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎంజీఎం ఆసుపత్రి వైద్యులను ఆయన కోరారు.