దుమ్ముగూడెం, ఆగస్టు 04 : దుమ్మగూడెం మండలం నరసాపురం గ్రామంలోని సూదిరెడ్డి నాగిరెడ్డి, ఆది లక్ష్మమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్ కార్యక్రమాన్ని ఆడిటర్ తాటి హరీష్ నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం బెక్కంటి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఉపాధ్యాయుల సహకారంతో సోషల్ ఆడిట్ నిర్వహించారు. పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు, వాటి నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, రిజిస్టర్లు, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, ఐ.ఎఫ్.పి. ప్యానల్స్ నిర్వహణ, తరగతి గదుల నిర్వహణను వారు పరిశీలించారు. అలాగే పాఠశాల స్థాయిలో నిర్వహిస్తున్న సైన్స్ ల్యాబ్ నిర్వహణ తీరును అభినందించారు.
అదేవిధంగా ఎన్జీఓ సహకారంతో కంప్యూటర్లను తీసుకుని పాఠశాల స్థాయిలో అద్భుతంగా నిర్వహణ చేస్తున్న ఉపాధ్యాయులను అభినందించటం గమనార్హం. అదేవిధంగా పాఠశాల స్థాయిలో నిర్వహిస్తున్న లైబ్రరీని చూసి ఉపాధ్యాయులను అభినందిస్తూ సాధ్యమైనంత త్వరలో మీకు కావాల్సిన పుస్తకాలన్నీ రానున్నట్లు వారు తెలిపారు. అనంతరం తల్లిదండ్రులతో, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులతోనూ విడివిడిగా సమావేశమై పాఠశాల పట్ల వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.