భూపాలపల్లి టౌన్, ఫిబ్రవరి 22 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక మానవీయ కోణం ఆవిష్కృతమైంది. పట్టణంలో కడు నిరుపేదలకు డబుల్బెడ్రూం యోగం కలిగింది. నిలువ నీడ లేకుండా 20 ఏళ్లుగా ఎండావానను భరిస్తూ చీరలు, కవర్ల్లతో ఒక చిన్న కర్రలపై వేసుకుని బతికే 15 పెద్దమ్మలోల్ల కుటుంబాలకు సొంతగూటిని అందించింది కేసీఆర్ సర్కారు. అంతేగాక వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి శారద నారాయణ చొరవ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కృషితో కులవృత్తి మానేసి కూలీ పనులకు వెళ్తున్న వీరికి డబుల్ బెడ్రూం ఇండ్లలోనూ చోటు దక్కింది. నేడు వారికి మంత్రి కేటీఆర్ ఇండ్ల పట్టాలు అందించనున్నారు. దీంతో వారి సంతోషాలకు అవధులు లేకుండా పోయింది.
కలలో కూడా అనుకోలే
20 ఏండ్లుగా ఇక్కడ బతుకుతున్నం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోలే. రోజూ అడుక్కు తినేవాళ్లం. ఎక్కడ గుడిసెలు వేసుకున్నా కొద్ది రోజులు ఉంచి తీసేసేవాళ్లు. ఆంజనేయుని గుడి దగ్గరలో చాలా రోజులుగా గుడిసెలు వేసుకొని బతుకుతున్నం. వార్డు మెంబర్ మాకు ఆధార్కార్డులు ఇప్పించిండు. ఓట్లు కూడా ఏస్తున్నం. అడుక్కుని తినకూడదు అన్నడు. అన్నట్లే కైకిలికి పోతన్నం. ఎండకు వానకు ఈ గూడులో బతుకలేకపోతున్నం. మమ్మల్ని కూడా అందరిలా బతికేటట్టు చూడమన్నం. సారు మా బాధ ఎమ్మెల్యేకు చెప్పిండు. ఇప్పడు మాకు ఒక గూడు సూపిస్తన్నడట. సాన సంతోషంగా ఉన్నది. సారుకు.. కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
– దేశవేని లింగమ్మ.
సీఆర్ నగర్ . భూపాలపల్లి .