వరంగల్, ఏప్రిల్ 27 : భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆరో రోజు గురువారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, పల్లకీసేవ, సాయంత్రం శేష వాహనంపై ఊరేగించారు. పెరిక సంఘం నాయకులు డీ నరేందర్, డీ కుమారస్వామి-భాగ్యలక్ష్మి, రవీందర్, జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, డాక్టర్ జగదీశ్వర్, చింతం సదానందం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముం దుగా ఆలయానికి విచ్చేసిన పెరిక సంఘం ప్రముఖులను ఆలయ ఈవో శేషుభారతి, అర్చకులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆలయ మండపంలో వారికి అర్చకులు అమ్మవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వడ్డే రవీందర్, సొమిశెట్టి శ్రీనివాస్, అల్లం నాగరాజు, పోతరాజు రాజేశ్వర్ రావు, బీర శంకర్ పాల్గొన్నారు. సాయంత్రం శేష వాహన సేవలో కుమ్మరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ రామూర్తి, ఆర్ కుమారస్వామి, కే వేణుగోపాల్, ఎన్ రాజేందర్, కుమ్మరి కుల వృత్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా విద్యారణ్య జయంతి
విద్యారణ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. భద్రకాళి ఆర్చీ కూడలిలోని విద్యారణ్య విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేశారు. విద్యారణ్య వరంగల్ వాసి కావడం గర్వకారణమని అభివర్ణించారు. నాలుగు వేదాలకు బాష్యం రాసి, వేద విజ్ఞానాన్ని ప్రజల ముంగిట ఉంచిన గొప్ప మహానీయులని కొనియాడారు.