వరంగల్, ఫిబ్రవరి 25 : పన్ను వసూళ్లలో బల్దియా ఆపసోపాలు పడుతున్నది. మరో నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, పన్నుల సేకరణ 50శాతం కూడా దాటకపోవడంతో ఆందోళన చెందుతున్నది. సొంత వనరులతో మనుగడ సాగించే బల్దియా పన్ను వసూళ్లలో ప్రణాళికాబద్దంగా అడుగులు వేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. చివరి రోజుల్లో కిందిస్థాయి సిబ్బందికి టార్గెట్లు పెట్టడంతో ఒత్తిడికి గురవుతున్నారు.
సొంత వనరులతో మనుగడ సాగించే బల్దియా ఆదాయ మార్గాల్లో వెనుకబడి పోతున్నది. ప్రధాన ఆదాయ మార్గమైన పన్నుల సేకరణకు ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో అధికారులు విఫలమయ్యారు. మరో నెలరోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, అనుకున్న స్థాయిలో పన్నుల వసూళ్లు జరుగక, చివరి రోజుల్లో రోజువారీ టార్గెట్లు పెట్టి కిందిస్థాయి ఉద్యోగులను ఉరికిస్తున్నారు. ఇప్పటి వరకు 38 శాతం మాత్రమే ఆస్తి పన్నులు వసూలు చేశారు. నెల రోజుల సమయం మాత్రమే మిగిలిఉండడం.. పన్నుల వసూళ్లు ఇప్పటి వరకు 50 శాతం దాటక పోవడం విస్మయాన్ని కలిగిస్తున్నది.
క్షేత్రస్థాయిలో పన్నులు వసూలు చేసే బిల్ కలెక్టర్లకు చివరి నిమిషాల్లో టార్గెట్లు విధించడంతో ఒత్తిడికి గురవుతున్నారు. మొదటి నుంచి ప్రణాళికాబద్దంగా పన్ను వసూళ్లలో అడుగులు వేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు ఉన్నాయి. ఏటా ఇదే తరహాలో ఇబ్బందిపడుతున్నా అధికారులు మాత్రం సరిదిద్దుకునే చర్యలు తీసుకోవడం లేదు. దీంతో పన్నుల సేకరణ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం లేదు.
మార్చి 31తో ఆర్థిక సవంత్సరం ముగుస్తున్న నేపథ్యంలో గ్రేటర్లో వంద శాతం పన్నుల సేకరణ కష్టంగా కనిపిస్తున్నది. రెండు సర్కిళ్ల పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా సత్ఫలితాలు రావడం లేదు. అధికారులు మొండి బకాయిదారులపై ప్రత్యేక దృష్టిసారించాలి. బకాయి పడిన బడాబాబులపై దృష్టి సారించాలి. పన్నుల వసూళ్లలో రోజువారీ టార్గెట్లతో కిందిస్థాయి ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారు.
పన్ను వసూళ్ల లక్ష్యసాధనలో కిందిస్థాయి ఉద్యోగులపై కాకుండా ఆర్ఐ, ఆర్వోల స్థాయిలో టార్గెట్లు విధించాలని అంటున్నారు. తమ పరిధిలో తాము పన్నులు వసూలు చేస్తున్నామని, అయినా, కొన్ని వెనకబడిన ప్రాంతాల్లో పన్నుల సేకరణ కష్టంగా మారుతుందని క్షేత్రస్థాయిలో పన్నులు వసూళ్లు చేసే సిబ్బంది చెబుతున్నారు. నిరుపేదలు నివాసముండే వెనకబడిన ప్రాంతాల్లో పన్నుల వసూళ్లు ఆశించిన స్థాయిలో జరగడం లేదని వాపోతున్నారు. రోజువారీ టార్గెట్లు భయపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు పన్నుల వసూళ్లు 50 శాతం దాటలేదు. ఆస్తి పన్నులతోపాటు నీటి పన్ను,ట్రేడ్ పన్నుల సేకరణ కూడా అదేస్థాయిలో ఉంది. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నుల రూపంలో రూ.176 కోట్ల వసూళ్ల డిమాండ్ ఉండగా, ఇప్పటి వరకు కేవలం రూ. 63కోట్లు మాత్రమే సేకరించారు. అంటే 38శాతం మాత్రమే వసూలయ్యాయి.
అయితే, గ్రేటర్ అధికారులు మాత్రం ఆస్తి పన్ను డిమాండ్ తప్పుగా చూపెడుతున్నదని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీజీజీ రూపొందించిన సాఫ్ట్వేర్ తప్పుల తడకగా ఉందని చెబుతున్నారు. రూ.125 నుంచి రూ.130 కోట్ల వరకు ఆస్తి పన్నుల డిమాండ్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ కార్పొరేషన్ ఆస్తి పన్ను డిమాండ్ ఏకంగా రూ.176 కోట్లు చూపెడుతుండటంతో అధికారులు గందరగోళానికి గురవుతున్నారు. ట్రేడ్ పన్నుల సేకరణలో సైతం ఆశించిన స్థాయిలో వసూళ్లు లేవు.
గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో 26,357 ట్రేడ్లు ఉన్నాయి. ఏటా ట్రేడ్ పన్నుల వసూళ్ల లక్ష్యం చేరుకోవడంలో అధికారులు తండ్లాడుతున్నారు. ఇప్పటి వరకు కేవలం 22 శాతం మాత్రమే వసూళ్లు చేశారు. వ్యాపార వర్గాల నుంచి పన్నుల సేకరణపై బల్దియా సిబ్బంది క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ట్రేడ్ పన్నుల వసూళ్లలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.