ఖిలా వరంగల్, ఫిబ్రవరి 14: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ పీ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం ఆమె మిషన్ భగీరథ ఇంట్రాగ్రిడ్, పంచాయతీ అధికారులతో వరంగల్ జిల్లాలో తాగునీటి సరఫరాపై సమీక్షించారు. పాలేరు నుంచి రాయపర్తి, నర్సంపేట మండలాలకు, ధర్మసాగర్ నుంచి పర్వతగిరి, వర్ధన్నపేట మండలాలు, పరకాల నియోజకవర్గంలోని సంగెం, గీసుకొండ మండలాలకు మిషన్ భగీరథ ద్వారా సక్రమంగా నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి ప్రారంభమైన దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాలను ముందస్తుగా గుర్తించి ప్రణాళికాబద్ధంగా మిషన్ భగీరథ నీరు క్రమం తప్పకుండా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అలాగే, గతేడాది నీటి ఎద్దడిని ఎదురొన్న గ్రామాల్లో సమస్య పునరావృతం కాకుండా చూడాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. మిషన్ భగీరథ ఏఈలు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి తాగునీటి సరఫరాలో ఉత్పన్నమయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి సరిచేయాలన్నారు. అన్ని గ్రామా ల్లో వెంటనే బోర్లు, చేతిపంపులకు మరమ్మతులు, ఫ్లషింగ్ చేయించాలని ఆదేశించారు. తాగునీరు వృథా కాకుండా గ్రామాల్లో ఎంపీవోలు, కార్యదర్శులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీపీవో కల్పన, మిషన్ భగీరథ ఎస్ఈ రాములు, ఈఈ వెంకటరామిరెడ్డి, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.