ఊరూవాడ ఏకమైంది. నెత్తిన బతుకమ్మలు, బోనాలతో చెరువుల వైపు కదిలింది. కేసీఆర్ సర్కారు పుణ్యమా అని తమకు ఆదెరువునిచ్చిన చెరువు వద్ద సంబురాలు చేసుకొని మురిసిపోయింది. రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా గురువారం ‘చెరువుల పండుగ’ వైభవంగా జరిగింది. ఆడబిడ్డలు, రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులంతా కలిసి చెరువుల వద్ద ఆటపాటలతో సరదాగా గడిపి అంతా కలిసి కుటుంబంలా సామూహిక భోజనాలు చేయడంతో ఏ పల్లెను చూసినా పండుగ వాతావరణమే కనిపించింది. ఆ తర్వాత కట్ట మైసమ్మ వద్ద పూజలు చేసి చెరువులో పూలు, పసుపు, కంకుమ చల్లి తమను చల్లగా చూడాలని వేడుకున్నారు. ఆయా చోట్ల చీఫ్విప్ దాస్యం, ఎమ్మెల్యేలు అరూరి, పెద్ది, సతీశ్కుమార్, రాజయ్య, హనుమకొండ, వరంగల్ జిల్లాల జడ్పీ చైర్మన్లు సుధీర్కుమార్, జ్యోతి, మేయర్ సుధారాణి, కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, సంధ్యారాణి, బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా పాల్గొని ఉత్సాహం నింపారు. బతుకమ్మలతో సందడి చేశారు.
– నమస్తే నెట్వర్క్, జూన్ 8
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చెరువుల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు నెత్తిన బోనాలు, బతుకమ్మలతో ర్యాలీగా బయల్దేరి రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి చెరువుల వద్దకు చేరుకొని సంబురాలు చేసుకున్నారు. పలుచోట్ల ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై జాతరవోలె ముందుకుసాగారు. ఈ సందర్భంగా ఆట పాటలతో సందడి చేశారు. అనంతరం కట్టమైసమ్మకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేశారు. అనంతరం అక్కడే సామూహిక భోజనాలు చేసి సరదాగా గడిపారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్
జనగామ జిల్లా కొడకండ్ల మండలం రంగాపురం గ్రామంలో నిర్వహించిన చెరువుల పండుగలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని ఉత్సాహం నింపారు. బతుకమ్మను నెత్తిన ఎత్తుకొని ఆ తర్వాత చెరువులో నిమజ్జనం చేశారు. జనగామ జిల్లాకేంద్రంలో నిర్వహించిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్ శివలింగయ్య పాల్గొని వంటకాలను పరిశీలించారు. హనుమకొండలోని భద్రకాళి బండ్ వద్ద ఉత్సవాల్లో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పాల్గొన్నారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు, బతుకమ్మ ఆటల ఆకట్టుకోగా చెరువంతా మిరుమిట్లు గొలిపే కాంతులతో మెరిసిపోయింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రంగాయచెరువు వద్దకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి భారీ సంఖ్యలో మహిళలు, రైతులతో కలిసి చేరుకొని చెరువులో పూలు చల్లి ప్రత్యేక పూజలు చేశారు. భూపాలపల్లి జిల్లాకేంద్రంలో నిర్వహించిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని వంటకాలను పరిశీలించారు.
హనుమకొండ పబ్లిక్ గార్డెన్ మత్సశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫిష్ ఫెస్టివల్ను చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ప్రారంభించి వివిధ రకాల చేపల వంటకాలను రుచి చూశారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో చేపల పండుగలో భాగంగా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ బోనమెత్తుకొని ర్యాలీ తీశారు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం కుందారం చెరువులో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పసుపు, కుంకుమ చల్లి ప్రత్యేక పూజలు చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో జడ్పీ అధ్యక్షురాలు అంగోత్ బిందు, ఎమ్మెల్యేలు శంకర్నాయక్, హరిప్రియానాయక్తో కలిసి మంత్రి సత్యవతిరాథోడ్ పాల్గొని చెరువులో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా తయారుచేసిన వంటకాలను ఆస్వాదించారు. మరిపెడ మండలం ఎల్లంపేటలో చెరువుల పండుగ ర్యాలీలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ పాల్గొన్నారు.