కాశీబుగ్గ, జనవరి 23: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మిర్చి రాకతో కళకళలాడుతోంది. డిసెంబర్ నుంచి కొత్త మిర్చి మార్కెట్కు వస్తోంది. సీజన్ ప్రారంభంలో 2వేల నుంచి 10వేల బస్తాల వరకు రాగా సంక్రాంతి తర్వాత పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. ఈ నెల 19న అత్యధికంగా 25వేల బస్తాలు వచ్చాయి. సోమ, మంగళవారాల్లో 20వేలకు పైగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ధరలు హెచ్చు తగ్గులు లేకుండా నిలకడగానే ఉంటున్నట్లు చెప్పారు. మిర్చి రాక పెరగడంతో అడ్తి, ఖరీదు వ్యాపారులతోపాటు దడువాయి, గుమస్తా, హమాలీ, ఇతర కార్మికవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు మార్కెట్కు 98వేల క్వింటాళ్లు వచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. మంగళవారం సుమారు 20వేల బస్తాలు వచ్చాయి. తేజ రకం 12,500, వండర్హాట్ 500, యూఎస్ 3,413, తాలు రకం మిర్చి 2వేల బస్తాలు వచ్చాయి. అత్యధికంగా తేజ రకం క్వింటాల్కు గరిష్ఠంగా రూ.20,400, కనిష్ఠం రూ.14,500, వండర్హాట్ అత్యధికంగా రూ.18వేలు, కనిష్ఠంగా రూ.15వేలు, యూఎస్ 341 రూ.16, 500, కనిష్ఠంగా 13వేలు, తాలు మిర్చి రూ.8,800, కనిష్ఠంగా రూ.5500 పలికింది