మక్కలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. దీంతో వరంగల్ జిల్లాలో పీఏసీఎస్ల ఆధ్వర్యంలో 20కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. మొత్తం 1.66 లక్షల టన్నుల మక్కలను సేకరించనున్నారు. ఒకటి రెండు రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా, మక్కలను వ్యవసాయ మార్కెట్ కమిటీల గోదాముల్లో నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
– వరంగల్, ఏప్రిల్ 28(నమస్తేతెలంగాణ)
వరంగల్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : రైతుల నుంచి యాసంగి మక్కలను కొనుగోలు చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. వరంగల్ జిల్లాలో 20 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. పీఏసీఎస్ల ద్వారా వీటిని నిర్వహించనున్నారు. ఒకటి రెండు రోజుల్లో కొనుగోలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాగు నీరు సమృద్ధిగా ఉండడంతో రైతులు యాసంగిలో మునుపెన్నడూ లేని రీతిలో మక్కజొన్న పంట సాగు చేశారు. ఈ నేపథ్యంలో మక్క రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయనుందని ప్రకటించారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని గురువారం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. పంట సాగు విస్తీర్ణం, దిగుబడులను పరిగణలోకి తీసుకుని 20 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు.
88 వేల ఎకరాల్లో సాగు..
ఈ సారి జిల్లాలో రైతులు 88,415 ఎకరాల్లో మక్కజొన్న సాగు చేశారు. జిల్లా చరిత్రలో ఇది రికార్డు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల 32,850 ఎకరాల విస్తీర్ణంలో మక్కజొన్న పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారుల సర్వేలో తేలింది. మిగతా 55,564 ఎకరాల నుంచి 1.66 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. మద్దతు ధర క్వింటాల్కు రూ.1,962గా ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన మక్కలను వ్యవసాయ మార్కెట్ కమిటీల గోదాముల్లో నిల్వ చేయనున్నారు. నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, గొర్రెకుంటలో ఉన్న ఏఎంసీల గోదాములకు కొనుగోలు కేంద్రాల నుంచి మక్కలను తరలించనున్నారు. మక్కల కొనుగోలు కేంద్రాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో పీఏసీఎస్ల అధికారులు నిమగ్నమయ్యారు.
కేంద్రాలు ఎక్కడంటే..
మక్కల కొనుగోలుకు వరంగల్ జిల్లాలో 20 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మహేశ్ వెల్లడించారు. చెన్నారావుపేట, దుగ్గొండి, నాచినపల్లి, ఖానాపురం ఏఎంసీ సబ్యార్డు, మహేశ్వరం, నర్సంపేట ఏఎంసీ, నల్లబెల్లి, తోపనపల్లి, నెక్కొండ, ఊకల్(హెచ్), మొగిలిచర్ల, వంచనగిరి, ఖిలావరంగల్, ఆరెపల్లి, కాపులకనపర్తి, సంగెం, ఏనుగల్, పర్వతగిరి ఏఎంసీ, రాయపర్తి ఏఎంసీ, ఇల్లంద ఏఎంసీలో కొనుగోలు కేంద్రాలు పని చేస్తాయని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో వీటిని ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు.