బయ్యారం, అక్టోబర్ 15 : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రామచంద్రాపురం గ్రామ కాంగ్రెస్లోని రెండు వర్గాల నాయకుల మధ్య ఇందిరమ్మ కమిటీల చిచ్చు రగిలింది. తాము సూచించిన వారినే కమిటీలో నియమించాలంటూ మంగళవారం మండల పరిషత్ కార్యలయం బయట గొడవకు దిగారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన ముగ్గరు వ్యక్తుల పేర్లు ఇవ్వాలని కాంగ్రెస్కు చెందిన మాజీ ఎంపీటీసీ మంగీలాల్, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లును అధికారులు కోరారు. వారిరువురు తమ వర్గానికి చెందిన వేర్వేరు వ్యక్తుల పేర్లను సూచించారు. ఈ క్రమంలో పేర్లను ఫైనల్ చేసేందుకు ఇరు వర్గాలు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకోగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ గ్రామ నాయకులు పేర్లెలా ఇస్తారని ఒక వర్గం.. మాజీ ప్రజా ప్రతినిధులు పేర్లు సూచించడమేంటని మరో వర్గం నేతలు వాదనకు దిగారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు తమపై పెత్తనం చేస్తున్నారని పాత కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తే.. గత ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశామని, తమకు సముచిత స్ధానం కల్పించాలని కొత్త నాయకులు వాదించుకున్నారు. ఎంతకూ విషయం తేలకపోవడంతో కార్యదర్శి రామస్వామి ఇరు వర్గాలు నాయకులు ఇచ్చిన పేర్లను ఉన్నతాధికారులకు అందించారు. అయితే మండలంలోని మరికొన్ని గ్రామాల్లోనూ ఇలాంటి పంచాయితీలే జరుగుతున్నట్లు తెలిసింది.