ఉద్యోగ ప్రకటనపై రెండో రోజూ సంబురాలు వెల్లువెత్తాయి. రికార్డు స్థాయిలో 80వేలకు పైగా కొలువులు భర్తీ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా, ఆయనఫ్లెక్సీలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం పాలాభిషేకాలు కొనసాగాయి. కొలువుల కోసం ఎదురుచూసిన తమకు తీపికబురు అందించి కొత్త ఉత్సాహం నింపారంటూ ఆనందం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఉద్యోగార్థులు, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు,టీఆర్ఎస్ నాయకులతో కలిసి తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. ఉద్యోగ ప్రకటన చేసిన సీఎం కేసీఆర్తో పాటు నర్సంపేటలో యువతకు ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చిత్రపటాలకు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరిలో పాలాభిషేకం చేశారు. రాయపర్తి మండలం సన్నూరులో నిరుద్యోగ యువకులు, సంగెం మండలకేంద్రంలో టీఆర్ఎస్ యూత్ నాయకులు సంబురాలు నిర్వహించారు. హనుమకొండ జిల్లా పరకాలలో రైతు రుణవిమోచన కమిటీ రాష్ట్ర చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్రావు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నడికూడలో టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు బొల్లారం అనిల్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లబెల్లి, గార్ల, బయ్యారం, దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో పాలాభిషేకాలు చేశారు. ములుగు జిల్లా వాజేడులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్లు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అలాగే తాడ్వాయిలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. – నమస్తే నెట్వర్క్