హైదరాబాద్, ఆగసు ్ట7 (నమస్తే తెలంగాణ): అధునాతన డిజిటల్ టెక్నాలజీ సాయంతో నీటి నిర్వహణ సమర్థంగా వినియోగించే అంశాలపై తెలంగాణ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పైలట్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. కేంద్ర జల్శక్తి శాఖ ఢిల్లీలో నిర్వహించిన వర్క్షాప్లో అందుకు సంబంధించిన ప్రణాళికను వివరించింది. ప్రపంచబ్యాంకు నిధులతో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ (పీఐపీ)ను ఫేజ్-2 కింద చేపట్టాలని ఎన్హెచ్పీ నిర్ణయించింది. అందుకోసం ఆయా అంశాలపై ఇటీవల అన్ని రాష్ర్టాల నుంచి పలు ప్రతిపాదనలను ఆహ్వానించింది. అందులో తెలంగాణ, గుజరాత్, అస్సాం ప్రణాళికలపై అత్యుత్తమంగా నిలిచాయి.
ప్రణాళికలపై అవగాహన కల్పించేందుకు అన్ని రాష్ర్టాలతో ఢిల్లీలో కేంద్ర జల్శక్తి శాఖ ప్రత్యేకంగా వర్క్షాప్ను శుక్రవారం నిర్వహించింది. ఇరిగేషన్ శాఖ సెక్రటరీ శ్రీధర్, హైడ్రాలజీ విభాగం ఎస్ఈ వెంకటరమణ పాల్గోన్నారు. తెలంగాణ రూపొందించిన ‘డబ్ల్యూ అమృతం’ (వాటర్- అడ్వాన్స్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్, టెక్నాలజీ, అనాలసిస్, మానిటరింగ్) పై ఎస్ఈ వెంకటరమణ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేవలం జల వివరాల సేకరణకే పరిమితం కాకుండా, ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని వరద నియంత్రణ, జలాశయాల నిర్వహణ, సాగునీటి పంపిణీలో విప్లవాత్మక మార్పులు తేవడమే తమ ప్రణాళిక ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. చెరువుల నిర్వహణ కోసం ‘మైనర్ ఇరిగేషన్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్’ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. సాగునీటి నిర్వహణ మెరుగుపరిచేందుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని వివరించారు.