గ్యాస్ ధర పెంపుపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిర్వహించారు. కార్పొరేట్లకు తొత్తుగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. గ్యాస్ సిలిండర్ ధరను ఇష్టారీతిన పెంచుతూ పేదలపై ఆర్థికభారం మోపుతున్న ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గళమెత్తారు. ఖాళీ సిలిండర్లతో వినూత్న ప్రదర్శనలు, రోడ్లపై కట్టెల పొయ్యిపై వంట చేశారు. గ్యాస్ బండ ధర తగ్గించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ దుర్నీతిని ఎండగట్టారు.
– నమస్తే నెట్వర్క్
వంట గ్యాస్ ధర పెంపుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు తొలిరోజు గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. పేద, మధ్యతరగతి ప్రజలపై మరింత భారం మోపేలా కేంద్రం ధరలు పెంచడంపై భగ్గుమన్న శ్రేణులు ఖాళీ సిలిండర్లతో రాస్తారోకోలు చేశారు. అక్కడే కట్టెలపొయ్యి పెట్టి వంటావార్పు చేసి కేంద్రం తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా మోదీ డౌన్ డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ధరలు తగ్గించేదాకా ఉద్యమిస్తామని స్పష్టంచేశారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 2
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, నాయకులు రోడ్లపై ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. సామాన్యులకు అందుబాటులో లేకుండా నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల వామపక్ష నాయకులు ఖాళీ సిలిండర్లతో రోడ్లపై బైఠాయించి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధరలు తగ్గించే వరకు ఉద్యమిస్తామని స్పష్టంచేశారు.
హనుమకొండలోని కలెక్టరేట్ వద్ద చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ పాల్గొని వంటావార్పుతో నిరసన తెలిపారు. అలాగే వర్ధన్నపేటలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ పాల్గొని నిరసన గళం వినిపించారు. మహబూబాబాద్లో ఎమ్మెల్యే శంకర్నాయక్ పాల్గొని రోడ్డుపై కట్టెలపొయ్యి పెట్టి వంటావార్పు చేశారు. జనగామలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి నిరసనలో పాల్గొన్నారు.