హనుమకొండ చౌరస్తా, జనవరి 3: మహాలక్ష్మీ పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆటోడ్రైవర్లు బుధవారం హనుమకొండ వేయిస్తంభాల ఆలయ సమీపంలో భిక్షాటనతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్ల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకుడు ఇసంపెల్లి సంజీవ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేసి 25 రోజులు కావస్తోందని, దీంతో ఆటోడ్రైవర్లు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆటోడ్రైవర్లకు వెంటనే జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని భిక్షాటన ద్వారా నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. కమిటీ నాయకులు మడికొండ బాబు, కంకోట్ల జయరాం, పసునూరి బాబు, మంద శ్రీధర్రెడ్డి, చీకటి కుమార్, బొల్లం సంజీవ, గుండా రమేశ్, సముద్రాల సాయిలు, పసునూరి శ్రీనివాస్, ఖాజాపాషా, మాషుక్, రాజు, హైమద్, భూక్యా నాయక్, పద్మారావు పాల్గొన్నారు.