హనుమకొండ చౌరస్తా, జూన్ 21: తొలకరి పలకరింపుతో ప్రజలు పులకరించిపోయారు. వానకాలం ప్రారంభమై పది రోజులు గడుస్తున్నా.. హనుమకొండ జిల్లావ్యాప్తంగా చినుకుజాడ లేకపోవడంతో అన్నదాతలు కలవరపడుతున్నారు. ఇన్ని రోజులు ఎండకు ఉక్కిరిబిక్కిరి అయినా ప్రజలు తొలకరి వానతో కొంత ఉపశమనం పొందారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. ఎన్నో ఆశలతో రైతులు వర్షాకాలం సాగుకు శ్రీకారం చుట్టారు. బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో పంట భూముల్లో రైతులు, రైతు కూలీల కోలాహలం కనిపించింది.
నగరంలోని ప్రజలు వర్షానికి తడిసి ముద్దయ్యారు. వ్యవసాయ పనులతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. పలు వ్యవసాయ క్షేత్రాల్లో పొలం పనులు ఊపందుకున్నాయి. నైరుతి రుతుపవనాలతో జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో రైతులు విత్తనాలు వేసే ప్రక్రియ ఆరంభమైంది. మరో రెండు, మూడుసార్లు భారీ వర్షాలు కురిస్తేనే విత్తనాలు వేసుకోవాలని, భూమిలో వేడి తగ్గే వరకు ఆగాలని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఆలస్యంగా పలకరించిన వర్షానికి రోడ్లు జలమయ్యాయి. ఉదయం నుంచి తీవ్రమైన ఎండతో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం పడటంతో ప్రజలు, రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది.