మహబూబాబాద్ రూరల్, నవంబర్ 27 : కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కష్టాలను కొనితెచ్చుకున్నట్లేనని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. సోమవారం ఆమె మహబూబాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ శంకర్నాయక్తో కలిసి మండలంలోని మల్యాల, రేగడితండా, చోక్లాతండా, దామ్యతండా గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఆయా తండాల ప్రజలు మంత్రి సత్యవతి, ఎమ్మెల్యేకు పూలతో స్వాగతం పలికారు. మంత్రి, ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికలు రాంగనే ఆగమాగం కావొద్దని, ఎవరు అభివృద్ధి చేశారో గుర్తించి ఓటు వేయాలన్నారు.గతంలో 50ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ తండాలను పట్టించుకోలేదన్నారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి, వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేశారని అన్నారు. సీఎం కేసీఆర్ ఎంతో కష్టపడి 24 గంటల కరెంట్ను తీసుకొస్తే కాంగ్రెస్ నాయకుడు రేవంత్రెడ్డి 3 గంటల కరెంటు చాలని అహంకారంగా మాట్లాడాడని, అతడికి రైతులు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్లీ కరెంట్ కష్టాలతో రైతులు ఇబ్బంది పడుతారని అన్నారు. ఎమ్మెల్యే శంకర్నాయక్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో పేదల కోసం అనేక పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నాడని అన్నారు. కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్, దళితబంధు వంటి పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు.
ఎన్నికలు రాగానే అనేక పార్టీల నాయకులు తండాలకు వచ్చి ఇష్టమొచ్చిన హామీలు ఇస్తారని, వాళ్ల మాయమాటలకు మోసపోవొద్దన్నారు. గత పాలకుల హయాంలో తండాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉండేవని, సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతనే వాటి రూపురేఖలు మారాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రియాంక, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు మహబూబ్ పాషా, నాయిని రంజిత్, తేళ్ల శ్రీను, అశోక్నాయక్, ఆవుల వెంకన్న, దాము, వీరన్న, నర్సింగ్ వెంకన్న, షరీఫ్, రామచంద్రు, బాలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.