వరంగల్, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చి అందరికీ ఎంతగానో ఉపయోగపడుతున్న ధరణిని తాము అధికారంలోకి వస్తే రద్దుచేస్తామని కాంగ్రెస్ నేతలు మాట్లాడడంపై రైతులు, ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే భూ సమస్యలు పెరిగి నానా తిప్పలు పడ్డామని, తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ధరణి వల్లే దాదాపు 90శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని, సులభంగా, పారదర్శకంగా సేవలందిస్తున్న ధరణి పోర్టల్పై దుష్ప్రచారం చేయడం తగదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
గతంలో రిజిస్ట్రేషన్ అంటే తలకుమించిన భారంలా ఉండేది. అత్యధిక శాతం మందికి రిజిస్ట్రేషన్ ఆఫీసులు దూరంగానే ఉండేవి. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. సాగు పనులకు ఇబ్బందయ్యేది. రైతు చనిపోతే ఆపద్బంధు కింద నాటి ప్రభుత్వాలు రూ.50 వేలు ఇచ్చేవి. ఇందుకోసం చనిపోయిన వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం, అతడి పేరిట భూమి ఉన్నదన్న ధ్రువీకరణ పత్రం సమర్పించాలన్న నిబంధన ఉండేది. ఇవన్నీ ఇచ్చినా చివరికి లంచాలు సమర్పిస్తేనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లేవి. వడ్లు, ఇతర పంటల అమ్మకాల సమయంలోనూ పహానీ నకల్, పాస్ పుస్తకాలు చూపాల్సి వచ్చేది. రిజిస్ర్టేషన్, మ్యుటేషన్, ఆర్వోఆర్.. కోసం రోజుల తరబడి సమయం పట్టేది. పైగా లంచాలు ముట్టజెప్పనిదే పని జరగపోయేది. ఇంత చేసినా ఏదో ఒక తప్పు దొర్లి ఏండ్ల తరబడి పరిష్కారం కాని సమస్యగానే మిగిలేది. భూ యజమానికి తెలియకుండానే ఫోర్జరీ సంతకాలతో క్రయవిక్రయాలు జరిగి, సదరు యజమాని ఆగమయ్యే పరిస్థితులు ఉండేవి. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో రిజిస్ట్రేషన్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. రెవెన్యూ వ్యవస్థ అంటేనే లంచాలతో నడిచేది అన్న పేరు వచ్చింది. సరైన వ్యవస్థ లేక భూముల వ్యవహారం అంటే తలనొప్పిగా భావించే పరిస్థితి ఏర్పడింది. రిజిస్ట్రేషన్ కావాలంటే నెలల తరబడి తిరగాల్సి రావడంతో చాలామంది తమ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే ఉండిపోవాల్సి వచ్చింది.
మానుకోట జిల్లాలో 41,500 రిజిస్ట్రేషన్లు పూర్తి
ధరణి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మహబూబాబాద్ జిల్లాలో 42,298 స్లాట్స్ బుక్ కాగా, 41,500 రిజిస్ట్రేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. మిగిలిన 798 దరఖాస్తులు ప్రాసెస్లో ఉన్నాయి. తహసీల్దార్ కార్యాలయంలోనే మ్యుటేషన్, పాస్ పుస్తకాల నమూనా పత్రం అందిస్తున్నారు. అనంతరం రైతులకు ఒరిజినల్ పాస్ పుస్తకం స్పీడ్పోస్ట్ ద్వారా నేరుగా ఇంటికే చేరుతున్నది. స్లాట్ సమయం ప్రకారం తహసీల్దార్ కార్యాలయంలో భూమిని అమ్మిన వారు, కొన్నవారితో పాటు సాక్షు లు సకాలంలో కార్యాలయానికి హాజరుకావాల్సి ఉంటుంది. వచ్చిన వెంటనే కంప్యూటర్ నుంచి డౌన్లోడ్ చేసిన డాక్యుమెంట్కు ఆధార్కార్డు, పాస్బుక్ జిరాక్స్లు జతచేస్తున్నారు. అనంతరం భూమిని అమ్మినవారు, కొన్నవారితో పాటు సాక్షి సంతకాలు చేసే వారి ఫొటోలు, ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నారు.
తర్వాత లాగ్బుక్లో క్రయవిక్రయాలు చేసిన వారితో పాటు సాక్షుల వివరాలను నమోదు చేస్తున్నారు. అనంతరం అమ్మిన వ్యక్తి పాస్పుస్తకంలో అమ్మిన భూమి విస్తీర్ణం తీసేసి, మిగిలిన విస్తీర్ణం వచ్చేలా ప్రింట్ తీస్తున్నారు. భూమి కొన్న వ్యక్తి పేరుమీద సర్వే నంబర్, భూమి విస్తీర్ణం నమోదు చేస్తున్నారు. పహానీతో పాటు డ్రాఫ్ట్ బుక్ అక్కడికక్కడే అందిస్తున్నారు. దీంతో భూమి అమ్మిన రైతు పాస్ పుస్తకంలో భూమి తగ్గిపోయి, తగ్గిన భూమి కొనుగోలు చేసిన వ్యక్తిపేరిట నమోదవుతుంది. గతంలో రైతులు రిజిస్ట్రేషన్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరిగినా పని కాకపోయేది. ఆ విధానానికి ప్రభుత్వం ధరణి ద్వారా స్వస్తి పలికి అందరి మోముల్లో చిరునవ్వులు తెచ్చింది.
ధరణితో ధైర్యంగా రైతులు
తహసీల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అవుతుండండంతో అందరికీ, ముఖ్యంగా రైతులకు ఎంతగానో మేలు జరుగుతున్నది. ఈ క్రమంలో పలువురు రైతులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక భూముల రక్షణ కోసం ఎంతగానో కృషి చేస్తున్నదని, ధరణి పోర్టల్ను తెచ్చి రైతులకు భూములపై భరోసా కల్పించిందని చెబుతున్నారు. గత ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, ఇతర వ్యవహారాలపై దృష్టి పెట్టకపోవడం, సరైన రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం వల్లే భూ సమస్యలు విపరీతంగా పెరిగాయని, ఇవన్నీ పరిష్కరించేందుకే సీఎం కేసీఆర్ ధరణిని తెచ్చారని పేర్కొంటున్నారు. ఇంత మంచి ధరణి పోర్టల్ను తాము అధికారంలోకి వచ్చే రద్దు చేస్తామని కాంగ్రెస్ నేతలు మాట్లాడడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరణి ద్వారా సులభంగా, పారదర్శకంగా సేవలందుతున్నాయని, మంచి వ్యవస్థ కోసం ఏవైనా సూచనలు ఇవ్వాలిగాని ఇలా మొత్తానికే రద్దు చేస్తామని చెప్పడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు.
మంచిగున్నది చెడగొడ్తరా?
మహబూబాబాద్ రూరల్, మే 30 : ఎంతోమంది నిరుపేదలకు ధరణితో ఎంతో లాభం అయితాంది. నేను కొన్న భూమిని ఎవరి సాయం లేకుండా నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నా. సీఎం కేసీఆర్ పేదల కోసమే ఈ ధరణి విధానం తీసుకొచ్చిండు. ఇదివరకు ఉన్న రాత పద్ధతి వల్ల చాలా నష్టం జరిగింది. ఒకరి పేరు మీద ఉన్నది మరో రకంగా చేసి ఇబ్బంది పెట్టేవాళ్లు. అప్పుడున్న సర్కారోళ్లు పట్టించుకోక ఇంకా సమస్యలు ఎక్కువైనయ్. ధరణి వచ్చిన తర్వాతనే ఇప్పుడు అలాంటి సమస్యలు లేకుండా పోయినయ్. కేసీఆర్ రైతుల కోసం పెట్టిన ధరణి ఎంతో మేలు చేస్తున్నది. సమయం వృథా కాకుండా వేగంగా పనులు అవుతున్నవి. అలాంటి ధరణిని ఎత్తేస్తామంటున్న కాంగ్రెసోళ్లు మా రైతులను ఏం చేద్దామనుకుంటున్నరు? సీఎం కేసీఆర్ మా రైతుల గురించి అన్ని విధాలా ఆలోచించి తెచ్చిన ధరణి వల్ల మంచి జరుగుతుంటే.. కాంగ్రెసోళ్లు వచ్చి చెడగొడ్తరా? ఇది పద్ధతేనా?
– ఎం.స్వాతి, వేంనూరు, మహబూబాబాద్
ఎవరెన్ని చెప్పినా ధరణి ఉండాల్సిందే..
కురవి, మే 30 : ఇదివరకు కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఊళ్లో డబ్బున్నోళ్లదే రాజ్యం లెక్క నడిచేది. అప్పుడు డబ్బు ఇస్తేనే భూమి ఉండేది, రికార్డులు మారేవి. గ్రామంలో ఉండే రెవెన్యూ వాళ్లదే రాజ్యం. ఎవరు డబ్బులిస్తే వారికే పట్టాలు వచ్చేవి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల రైతులకు న్యాయం జరిగింది. ముందుచూపుతో సీఎం కేసీఆర్ ఆలోచించి ధరణితో పాటు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి రైతులకు ఎంతో మేలు చేశారు. మా నాన్న కందిపాటి ఎల్లయ్యకు నేను ఒక్కడినే కొడుకును. పుట్టు దివ్యాంగుడిని. పెన్షన్ వస్తున్నది. మాకు 3.18 ఎకరాలు ఉంది. బ్యాంకు లోన్ కోసం పోతే బ్యాంకోళ్లు పాసుపుస్తకం చూసి ఎమ్మటే లోన్ ఇచ్చారు. ఆ డబ్బులు పెట్టుకునే వ్యవసాయం చేస్తున్నాం. ధరణి రావడం వల్ల రికార్డులన్నీ ఆన్లైన్ అయినయ్. ఎవరెన్ని చెప్పినా రైతుల గుండెల్లో సీఎం కేసీఆర్ ఉన్నడు. ఏ పార్టీ వాళ్లు వచ్చి ఎన్ని చెప్పినా పెన్షన్దారులు, రైతుల మనసు మారదు.
– కందిపాటి ఉమేశ్, మోద్గులగూడెం
నాడు అలసిసొలసి వేసారి..
నాడు భూమిని కొన్న తర్వాత ఒరిజినల్ పత్రాలు పట్టుకొని తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోకు పహాణీ పట్టాపాస్పుస్తకం కోసం దరఖాస్తు చేసుకునేవారు. వీఆర్వో సంతకం, సీనియర్ అసిస్టెంట్, అక్కడి నుంచి డిప్యూటీ తహసీల్దార్, తరువాత తహసీల్దార్ సంతకాలు పూర్తయిన తర్వాత పహాణీలో పేరు, భూమి విస్తీర్ణం వచ్చేది. అనంతరం పట్టాపాస్ పుస్తకాలను తయారు చేసిన తర్వాత మళ్లీ తహసీల్దార్ సంతకం, అక్కడి నుంచి ఆర్డీవో సంతకం కోసం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి వచ్చే సరికి నెలలు గడిచేది. కొంతమంది రైతులు తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయి పాస్ పుస్తకాలు లేకున్నా మంచిదే అని వదిలేసిన రోజులున్నాయి. వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించడం వల్ల మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ ఈ రెండు పనులు ఏకకాలంలో పూర్తవుతున్నాయి.
ధరణిపై ఎందుకింత కండ్లమంట..
చిన్నగూడూరు, మే 30 : తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ధరణి రైతుల భూములకు రక్షణగా ఉంటున్నది. మన భూముల వివరాలను ఎప్పటికప్పడు తెలుసుకునేందుకు ధరణి పోర్టల్ ఎంతో దోహదం చేస్తుంది. గతంలో మాదిరిగా అధికారుల చుట్టూ తిరిగి తమ భూముల వివరాలను తెలుసుకునే పద్ధతికి స్వస్థి చెప్పి నూతన సాంకేతికత వైపు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేసి సులభతరమైన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. కానీ ఇవన్నీ గిట్టని ప్రతిపక్షాలు ధరణి పోర్టల్పై లేనిపోనివి ప్రచారం చేయడం సరికాదు. ఎంతోకాలంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తీరుతున్నందుకు కాంగ్రెస్ లీడర్లకు ఎందుకింత కండ్లమంట? తెలంగాణ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కష్టాలు తీరినయని రైతులంతా సంబురపడుతుంటే ఇప్పుడేమో కాంగ్రెసోళ్లు ధరణిని రద్దు చేయాలనడంలో ఉద్దేశం ఏమిటి. మళ్లీ రైతులు ఇబ్బందుల్లోకి నెట్టే పాత పద్ధతి వస్తే గ్రామీణ నిరక్షరాస్యులైన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అలా జరగకూడదని ఉండాలంటే ధరణి పోర్టల్ అలాగే ఉండాలి.
– ధరంసోత్ పూల్సింగ్, ఉగ్గంపల్లి
భూముల లొల్లి అట్లనే ఉండల్నా..?
మరిపెడ, మే 30 : గ్రామాల్లో గందరగోళంగా ఉన్న భూముల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రం ప్రభుత్వం అమలుచేస్తున్న ధరణి వల్ల అవన్నీ పరిష్కారం అవుతున్నాయి. పల్లెల్లో వ్యవసాయ భూములు కలిగి ఎంతోకాలం కలిసి ఉన్న రైతులు గందరగోళంగా ఉన్న భూ రికార్డుల వల్ల పలుమార్లు గొడవలు, పంచాయితీలు అయినయ్. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న ధరణి పోర్టల్ వల్ల గ్రామాల్లో క్రమంగా భూసమస్యలు పరిష్కారం కావడంతో పాటు గెట్టు రైతుల వివాదాలు తగ్గుతున్నాయి. రెవెన్యూ అధికారులు కూడా పారదర్శకంగా పట్టాపాస్ పుస్తకాలు ఇస్తున్నారు. అన్నీ సాఫీగా జరుగడం వల్లే ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణాలు అందుతున్నాయి. ఇలా అన్నీ మంచిగ నడవడం బాగాలేనట్టుంది కాంగ్రెసోళ్లకు. మళ్లీ ఎప్పటిలాగనే భూముల కోసం లొల్లులు, పంచాయితీలు కావాల్నా ఏంది. ఇలా మాట్లాడడం మంచిది కాదు.
– గుగులోత్ బాలజీనాయక్, గిరిపురం
ధరణి కొనసాగాల్సిందే..
దంతాలపల్లి, మే 30 : తరాలు మారినా తీరని భూ సమస్యలు ధరణితో పరిష్కారం అవుతున్నాయి. గతంలో రాతపూర్వకంగా పహానీలు ఇవ్వడం వల్ల అధికారులు, నాయకులు రాత్రికి రాత్రే పేర్లను మార్చుకునేవారు. తెల్లారితే మన భూమి ఉన్నదో, పోయిందో తెలిసేది కాదు. దీని వల్ల గొడవలు కూడా జరిగేవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత వీటన్నిటికీ చెక్ పడింది. ఇప్పుడు భూమి ఒకరి పేరు నుంచి మరొకరికి మారాలంటే రైతు వేలిముద్ర తప్పనిసరి. ఇద్దరు రైతులు అక్కడ ఉంటేనే ఇది సాధ్యమయ్యేలా చాలా మంచిగ తయారుచేశారు. తరతరాల నుంచి పెండింగ్లో ఉన్న భూ సమస్యలు కూడా తీరుతున్నాయి. ఇప్పుడు మా భూములు భద్రంగా ఉన్నా యన్న ధైర్యం వచ్చింది. ఇంత మంచిగా ఉన్న ధరణిని తీసేసి మళ్లీ రైతులను ఆగమాగం చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు చూస్తున్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్కు రూపకల్పన చేసి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపారు. ధరణిని ఇలాగే కొనసాగించాలి.
– గాదనబోయిన కొమురయ్య, పెద్దముప్పారం
ధరణితో రైతుల కష్టాలు తీరాయి
డోర్నకల్, మే 30 : ఎన్నో ఏళ్ల నుంచి భూ సమస్యలతో రైతులు చాలా కష్టపడేవారు. 70 ఏళ్లుగా ఎన్ని ప్రభుత్వాలు పాలించినా రైతులను పట్టించుకున్నది లేదు. భూములకు సరియైన హక్కు పత్రాల కోసం రైతులు అరిగోస పడేది. వీటిన్నింటినీ గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి తీసుకొచ్చి ఐదు నిమిషాలల్లో పట్టా పాసుబుక్ అందజేస్తున్నారు. కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంతో సాగు నీళ్లు తెచ్చి రెండు పంటలకు సాగు నీళ్లు అందించిండ్రు. నేను 20గుంటల భూమి కొనుగోలు చేస్తే పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చిను. రైతుబంధు పథకంతో రెండు విడతలగా రూ.5 వేలు పెట్టుబడి సాయం అందుతున్నది.రైతన్నలను రాజును చేసిన సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు. ఇప్పుడిప్పుడే కష్టాలు తీరి సంతోషంగా ఉంటున్న సమయంలో కాంగ్రెసోళ్లు ధరణి తీసేస్తామనడం కరెక్ట్ కాదు.
– నూనావత్ నిరోషాబాయి, డోర్నకల్