మారేడ్పల్లి, ఆగస్టు 11: ఓ టోక్నో స్కూల్ హాస్టల్లో విద్యార్థిపై జరిగిన దాడి ఘటనను దాచిపెట్టేందుకు యత్నించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం డీసీపీ శ్రీధర్ కేసు వివరాలను వెల్లడించారు. జవహర్నగర్ పీఎస్ పరిధిలోని దమ్మాయిగూడలోని ఓ టెక్నో పాఠశాలలోని హాస్టల్లో ఉంటూ 10వ తరగతి చదువుతున్న బాలుడిపై ఈనెల 7, 8వ తేదీల్లో రాత్రి తోటి విద్యార్థుల బృందం దాడిచేశారు.
అయితే దాడి జరిగిన విషయాన్ని దాచిపెట్టి, బాలుడు మెట్లపై నుంచి పడిపోయాడని పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించింది. బాలుడిని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు అసలు విషయం తెలియడంతో ఈనెల 10న జవహర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన దాచిపెట్టడంలో ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్, హాస్టల్ వార్డెన్ బాబు, హాస్టల్ ఇన్చార్జి ఆకాశ్ పాత్ర ఉన్నట్లు తేలింది. దీంతో ఈ ముగ్గురుని పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు.