న్యూఢిల్లీ, ఆగస్టు 11: దేశంలో ఇటీవల పుంజుకున్నట్టు కన్పించిన నైరుతి రుతుపవనాల బలం క్రమేపీ తగ్గుతున్నది. ఉపగ్రహాలు విడుదల చేసిన తాజా చిత్రాల ప్రకారం బంగాళాఖాతం సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో కమ్ముకున్న మేఘాల విస్తీర్ణం తగ్గుముఖం పట్టింది. కొన్ని వారాల పాటు వర్షపాతం చురుకుగా నమోదైన తర్వాత ఈ తాజా పరిణామాలు ఎల్ నినో ప్రభావం మొదలవుతుందేమోనన్న ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం మధ్యభారత దేశంపై అల్పపీడన వ్యవస్థ మేఘాలను మదించి వర్షాలను కురిపించే ప్రధాన వాతావరణ వ్యవస్థగా కొనసాగుతున్నది. దీని ప్రభావం ప్రధానంగా దేశంలోని మధ్య ప్రాంతానికే పరిమితమై ఉండగా, ఇతర ప్రాంతాల్లో రుతుపవన కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడం ప్రారంభమైంది.
మన రుతుపవనాలకు తేమను అందించే కీలక వనరు అయిన బంగాళాఖాతంపై మేఘాల ఆవరణ తగ్గడం అనేది ఒక ముఖ్యమైన సంకేతాలలో ఒకటి. కాగా, రుతుపవన అక్షం కూడా దక్షిణం వైపునకు మారుతున్నది. ఈ మార్పు వల్ల అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఉత్తర మైదానాల నుంచి దూరంగా జరుగుతుంది. తద్వారా, ఢిల్లీ-ఎన్సీఆర్, హర్యానా, పంజాబ్, యూపీలలో ప్రధానంగా పొడి వాతావరణం తిరిగి వచ్చే అవకాశం ఉంది.
పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో పరిస్థితుల పురోగతిని శాస్త్రవేత్తలు, వాతావరణ పరిశీలకులు నిశితంగా గమనిస్తున్న తరుణంలో ఈ కొత్త ధోరణి ఆవిర్భవిస్తున్నది. ఎల్ నినో సాధారణంగా వాతావరణ ప్రసరణలో మార్పులతో ముడిపడి ఉంటుంది. అది దేశంలోని రుతుపవనాలను బలహీనం చేయవచ్చు లేదా అంతరాయం కలిగించవచ్చు. దాని ప్రభావం ఒక్కో సంఘటనకు ఒక్కో విధంగా ఉంటుంది.
ఉపగ్రహాలు తాజాగా వెలువరించిన చిత్రాలు రుతుపవనాల వైఫల్యాన్ని కచ్చితంగా చూపించవు. వర్షాన్ని కురిపించే వాతావరణ వ్యవస్థలు మధ్య భారతదేశంలో చురుకుగానే ఉన్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితులు చూస్తే రుతుపవనాలు మందగమన స్థితికి చేరుకున్నాయని అనిపిస్తున్నది. ఈ బలహీన మేఘాల స్థితి తాత్కాలికమా, లేక ఎల్ నినోకు మొదటి స్పష్టమైన సంకేతమా? అన్న విషయాన్ని నిర్ధారించడానికి మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.