ఆదిలాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ) : వివిధ రకాల జబ్బులతో బాధపడుతూ రిమ్స్కు వచ్చే వారికి కార్పొరేట్ వైద్యసేవలు ఉచితంగా అందిస్తున్నట్లు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. మంగళవారం రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన గీతాబాయి ఫియోక్రోమోసైటోమా అని వ్యాధితో బాధపడుతూ రిమ్స్కు వచ్చిందన్నారు. నిపుణులైన వైద్యులు చికిత్సలు అందించామని, యాస్మిన్ అనే మహిళకు కూడా లంగ్స్ క్యాన్సర్కు చికిత్స అందించామన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ ఆపరేషన్లకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతాయని తెలిపారు.
నిర్మల్కు చెందిన మరో మహిళకు థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటే ప్రాంక్యార్టిక్ సర్జరీలు చేసినట్లు తెలిపారు. వీటితోపాటు నెల రోజుల వ్యవధిలో సూపర్ స్పెషాలిటీలో గుండె జబ్బు సమస్యలు ఉన్న 61 మందికి యాంజియోగ్రామ్ నిర్వహించామన్నారు. వీటితోపాటు టీఎంటీ పరీక్షలు జరిపామని, గుండె జబ్బులు ఉన్న వారికి త్వరలో స్టంట్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ వైద్యనిపుణుడు జక్కుల శ్రీకాంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా వంటి ఆసుపత్రుల్లో లభించే వైద్యసేవలు ఆదిలాబాద్ రిమ్స్లో అందిస్తున్నట్లు తెలిపారు. 450 మంది రోగులకు క్యాన్సర్ ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు.
కిడ్నీ వైద్యనిపుణులు కార్తీక్ మాట్లాడుతూ.. రిమ్స్లో ఇటీవల 3 వేల కేసులను పరిశీలించి మెరుగైన వైద్యసేవలు అందించామన్నారు. గుండె వైద్య నిపుణుడు జకారియా మాట్లాడుతూ.. గతంతో జిల్లా వాసులు హార్ట్కు సంబంధించిన వ్యాధులకు హైదరాబాద్ లాంటి పట్టణాలకు పోయేవారిని ఇప్పుడు రిమ్స్లో అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రిమ్స్ వైద్యకళాశాల దేశంలో 139 ర్యాంకు రాష్ట్రంలో 4 ర్యాంకు సాధించినట్లు డైరెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో న్యూరాలజీ వైద్యులు విజయ్మోహన్, వైద్యులు బండారి నరేందర్,చంపత్ రావు ఉన్నారు.