కుభీర్ : కుభీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికను మాయమాటల తో తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి ( Assault Case ) పాల్పడిన ఘటనపై పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని భైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ ( CI Praveen Kumar ), కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి ( SI Krishna Reddy ) తెలిపారు.
మంగళవారం సాయంత్రం బాలిక, ఇతర పిల్లలతో కలిసి గణేష్ మండపం సమీపంలో ఆడుకుంటుండగా, నిందితుడు వారిని మాయమాటలతో తన ఇంటికి తీసుకెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైందన్నారు. అనంతరం ఇతర పిల్లలను బయటకు పంపించి, బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చిందని తెలిపారు.
బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి, బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించి, ఆమె వాంగ్మూలాన్ని చట్ట ప్రకారం నమోదు చేశామన్నారు. భైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద నిందితుడు జాదవ్ బిక్కును అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని పేర్కొన్నారు.