వరంగల్ చౌరస్తా, మార్చి 10: వరంగల్ సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి స్థలం కేటాయింపుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు డోలు వా యిద్యాల మధ్య ర్యాలీగా శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ స్థలానికి చేరుకొని రంగులు చల్లుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా 27వ డివిజన్ కార్పొరేటర్ అనిల్కుమార్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటైన ఎనమిదిన్నర ఏళ్ల కాలంలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్.. ప్రత్యేక శ్రద్ధతో తూర్పు కేంద్రంగా వరంగల్ జిల్లాను ఏర్పాటు చేశారని కొనియాడారు. తూర్పు నియోజకవర్గాన్ని జిల్లాకేంద్రంగా మార్చడానికి, సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్మించడానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇన్నాళ్లు వెనుకబాటుకు గురైన వరంగల్ నగరానికి పరిపాలనా సౌలభ్యాన్ని కల్పించి, అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సహకారంతో కలెక్టరేట్ నిర్మాణానికి నన్నపునేని కృషి చేస్తున్నారని కొనియాడారు. 27.08 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ శాఖకు అప్పగించాలని చేనేత జౌళి శాఖకు గురువారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కలెక్టరేట్ నిర్మాణానికి అడుగులు ముందుకు పడడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో వరంగల్ తూర్పు నియోజరవర్గ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.కలెక్టరేట్కు స్థలం కేటాయింపుపై హర్షం