హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : వైద్యారోగ్య శాఖలో డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ విభాగంలో అవినీతి బాగోతాన్ని వెలికితీస్తూ గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ‘డీహెచ్లో షాడోల హల్చల్!’ పేరిట ప్రచురితమైన కథనం వైద్యారోగ్యశాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. నిఘా వర్గాలు సైతం అవినీతి అధికారులు ఎవరు..? అని ఆరా తీసినట్టు తెలిసింది.
మరోవైపు గురువారం తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీజీఎంఎస్ఐడీసీ)లో నిర్వహించిన సమీక్షలో సంబంధిత అధికారులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ అయినట్టు తెలిసింది. ఉద్యోగోన్నతులు పొంది వెళ్లిన వారిని మళ్లీ డీహెచ్ కార్యాలయంలో కొనసాగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని చెప్పినట్టు తెలిసింది.