ఈ నెల 23 నుంచి టెన్త్ పరీక్షలు..
జూన్ 1 వరకు నిర్వహణ
ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో
41 కేంద్రాల్లో ఏర్పాట్లు
హాజరుకానున్న 7,171 మంది విద్యార్థులు
మహబూబాబాద్ లో 58 కేంద్రాల్లో ఏర్పాట్లు
హాజరుకానున్న 9,289మంది..
పర్యవేక్షణకు సెంటర్లలో సీసీ కెమెరాలు
స్కాడ్స్ టీమ్లు, ఇన్విజిలేటర్ల నియామకం
భూపాలపల్లి రూరల్/ ములుగు టౌన్, మే 20 : పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించకుండానే ప్రభుత్వం విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఈ ఏడాది మే 23 నుంచి జూన్ 1 వరకు టెన్త్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల విద్యాశాఖ అధికారులు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు సీసీ కెమెరాలతో పాటు, స్కాడ్ టీమ్లు, ఇన్విజిలేటర్లను నియమించారు.
జయశంకర్ జిల్లాలో 20 పరీక్ష కేంద్రాలు..
3,772 మంది విద్యార్థులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 122 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 3,762 మంది పదోతరగతి చదువుతున్నారు. ఇందులో బాలికలు 1,943 మంది, బాలురు 1,829 మంది ఉన్నారు. 10 మంది ప్రైవేట్గా ఫీజు చెల్లించారు. గత సంవత్సరం జిల్లాలో 30 పరీక్ష కేందాల్రను ఏర్పాటు చేసినప్పటికీ కరోనా కారణంగా పరీక్షలు జరుగలేదు. ప్రస్తుత సంవత్సరం విద్యార్థుల సంఖ్యను బట్టి జిల్లాలో 20 పరీక్ష కేందాల్రను ఏర్పాటు చేశారు. 20 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ముగ్గురు సీ సెక్షన్ కస్టోడియన్లు, 215 మంది ఇన్విజిలేటర్లు, రెండు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను నియమించారు.
డీఈవో కార్యాలయంలో కంట్రోల్ రూం
ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా డీఈవో శ్రీనివాస్ రెడ్డి 90101 06668, జిల్లా ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి బానోత్ జుమ్ము నాయక్ 99519 46418 నంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.
ములుగు జిల్లాలో 21 కేంద్రాలు..
3,399 మంది విద్యార్థులు
జిల్లా వ్యాప్తంగా 3,399 మంది ప్రభుత్వ, ప్రైవేట్, విద్యార్థులు పరీక్షలు రాయనుండగా 21 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 3,396 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, ముగ్గురు ప్రైవేట్గా ఫీజు కట్టారు. పరీక్షల నిర్వహణలో భాగంగా 21 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 21 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 203 మంది ఇన్విజిలేటర్లు, రెండు ప్లయింగ్ స్కాడ్ బృందాలు, ఐదు సిట్టింగ్ స్కాడ్ బృందాలను నియమించారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. సందేహాల నివృత్తి కోసం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశాం. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందు చేరుకోవాలి.
– బీ శ్రీనివాస్ రెడ్డి, జయశంకర్ జిల్లా విద్యాశాఖ అధికారి
పారదర్శకంగా పరీక్షలు
పది పరీక్షలు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చుతున్నాం. హాల్టికెట్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు ప్రధానోపాధ్యాయులను సంప్రదించి తీసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రానికి తీసుకురావొద్దు. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
– జీ పాణిని, ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి