కాంగ్రెస్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పోటీలో తగ్గేదే లేదని తెగేసి చెబుతున్నారు. ఆ పార్టీ రెండో జాబితా వెలువడినకాన్నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న ఆశావహులు, పార్టీ పెద్దలు బుజ్జగించినా ససేమిరా అంటున్నారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం పని చేసిన తమను కాదని, అప్పటికప్పుడు చేరిన వారికి పెద్దపీట వేయడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. తమ అనుచరులు, కార్యకర్తలతో సమావేశమవుతూనే భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. వరంగల్ పశ్చిమం నుంచి జంగా రాఘవరెడ్డి, హుస్నాబాద్ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి పోటీలో ఉండేందుకే నిర్ణయించుకున్నారు. మరోవైపు వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, మహబూబాబాద్ నియోజకవర్గాల్లోనూ అసంతృప్త నేతలు కాంగ్రెస్తో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు.
వరంగల్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్లో టికెట్ల లొల్లి ఇంకా ముదురుతూనే ఉన్నది. టిక్కెట్ దక్కని నేతలు తగ్గేదే లేదంటున్నారు. కచ్చితంగా పోటీలో ఉంటామని తెగేసి చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం జాబితాలో తమ పేరు లేకున్నా బీఫారం మాత్ర మే తమకే దక్కుతుందని గట్టిగా చెబుతున్నారు. కాంగ్రెస్ రెండు జాబితాల్లో టిక్కెట్ దక్కని నాయకులు, పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం పని చేసిన తమకు అన్యాయం చేశారని, అప్పటికప్పుడు పార్టీలో చేరిన వారిని అభ్యర్థులుగా ప్రకటించారని ఆగ్రహంతో ఉన్నారు. రెండో జాబితా వచ్చిన రోజు నుంచి అసంతృప్త నేతలు తమ అనుచరులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించకుంటున్నారు. ఎన్నికల్లో తమ వ్యూహం అమలుపై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వరంగల్ పశ్చిమం, పరకాల, వరంగల్ తూ ర్పు, వర్ధన్నపేట, మహబూబాబాద్, హుస్నాబాద్ సె గ్మెంట్లలో అసమ్మతి రోజురోజుకూ పెరుగుతున్నది. వరంగల్ పశ్చిమంలో కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ డీసీ సీ మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి సొంతంగా బలం చాటేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తన సేవలను గుర్తించలేదని, అక్రమార్కులకు అవకాశం ఇచ్చిందని మండిపడుతున్నారు. రెండు రోజులుగా అనుచరులు, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. వరంగల్ పశ్చిమంలో పోటీ చేస్తానని తెగేసి చెబుతున్నారు. ఒక్క రోజు ముందు చేరిన వారికి, పార్టీ సభ్యత్వం లేని వారికి టిక్కెట్లు ఇవ్వడంతో కాంగ్రెస్ క్యాడర్లో ఆత్మస్థయిర్యం దెబ్బతిన్నదని చెబుతున్నారు. ప్రజల మద్దతుతో వరంగల్ పశ్చిమ సెగ్మెంట్లో ఇండిపెండెంట్గా పోటీ చే స్తానని అనుచరులతో అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా చూసిన తర్వాత ఉమ్మడి జిల్లాలోని ఆరు సీట్ల లో ఎన్నికలకు ముందే పార్టీ ఓడిపోయినట్లయిందని, మిగిలిన సీట్లలోనూ పోటీ ఇచ్చే పరిస్థితిలో లేదని చెబుతున్నారు. జంగా వరంగల్ పశ్చిమంలో బరి లో నిలవాలని అనుచరుల నుంచి ఒత్తిడి వస్తున్నది. పూర్తి స్థాయి లో సంప్రదింపుల అనంతరం తన నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటిస్తానని అనుచరులతో అంటున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత పరకాల, పాలకుర్తి, మహబూబాబాద్, వరంగల్ పశ్చిమం, హుస్నాబాద్ సెగ్మెంట్లలో సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పదేండ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న తన ను కాదని కాంగ్రెస్ సభ్యత్వం లేని రేవూరి ప్రకాశ్రెడ్డికి టిక్కెట్ ఇవ్వడంపై ఇనగాల వెంకట్రాంరెడ్డి నారాజ్లో ఉన్నారు. అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించిన తర్వాత రోజు నియోజకవర్గంలోని అనుచరులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. పార్టీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి తనను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. రెండోరోజు నుంచి సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని ఇనగాల అనుచరులు చెబుతున్నారు. పాలకుర్తిలో కాంగ్రెస్ టిక్కెట్ను పార్టీతో ఎలాంటి సంబంధం లేని వారికి ఇచ్చారని ఆ పార్టీ నేత ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. భారతదేశ పౌరసత్వం లేని ఝాన్సీరెడ్డికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వాలని చూసిందని, ఇది సాధ్యం కాదని తెలిసిన తర్వాతా పార్టీకి సంబంధంలేని ఝాన్సీరెడ్డి కోడలు యశస్వినిని అభ్యర్థిగా ప్రకటించిందని తిరుపతిరెడ్డి వాపోతున్నారు.
కాంగ్రెస్లో పని చేసిన వారికి గుర్తింపు దక్కే పరిస్థితి లేదని అంటున్నారు. వర్ధన్నపేట కాంగ్రెస్ టిక్కెట్ విషయంలో పార్టీ అధిష్టానం తప్పుడు నిర్ణయం తీసుకున్నదని పీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్ అన్నారు. రెండో జాబితాలో తన పేరు లేకున్నా బీఫారం తనకే వస్తుందని చెప్పారు. వర్ధన్నపేటలో ఎక్కువ సంఖ్య లో ఉన్న వర్గాలను విస్మరించి కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తున్నదని నమిండ్ల అనుచరులు చెబుతున్నారు. వరంగల్ తూర్పు సెగ్మెంట్లో కొండా సురేఖకు టిక్కెట్ ఇవ్వడంపై అభ్యర్థిత్వం ఆశించిన నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మార్చుకోవాలని, లేకుంటే పార్టీ అభ్యర్థికి సహకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. మహబూబాబాద్ టిక్కెట్ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, రాష్ట్ర నేత బెల్లయ్యనాయక్ అసంతృప్తితోనే ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నియోజకవర్గానికి వచ్చి ప్రచారం మొదలుపెట్టినా వీరిద్దరూ దూరంగానే ఉంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మార్చుకోవాలని ఇద్దరు నేతలు కోరుతున్నారు. హుస్నాబాద్ టిక్కెట్ దక్కని మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి సొంతంగా పోటీ చేయాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం మోసం చేసిందని, నియోజకవర్గంతో సంబంధంలేని వ్యక్తికి టిక్కెట్ ఇచ్చి గెలవలేని పరిస్థితి తెచ్చిందని అంటున్నారు. బీఫారం ఇచ్చే సమయంలో అయినా అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.