హైదరాబాద్, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ) : కర్ణాటక మీడియా అకాడమీ నిర్వహించిన జాతీయస్థాయిలో ఫొటోగ్రఫీ పోటీల్లో విజేత నిలువడం తెలంగాణ బిడ్డగా చాలా గర్వంగా ఉన్నదని ‘నమస్తే తెలంగాణ’ డిప్యూటీ చీఫ్ ఫొటోగ్రాఫర్ వీరగోని రజినీకాంత్ గౌడ్ పేర్కొన్నారు. వందల్లో వచ్చిన ఎంట్రీల్లోనూ సృజనాత్మకతను వెలికితీసేలా అద్భుతమైన ఫొటోలను ఎంపిక చేసి, ఘన సత్కారంతో అక్కున చేర్చుకున్న కర్ణాటక ప్రభుత్వానికి, మీడియా అకాడమీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం బెంగళూరులోని చిత్రకళా ఆర్ట్ గ్యాలరీలో అవార్డులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ నుంచి ఎంపికైన రజినీకాంత్ ఫొటో తృతీయ బహుమతికి ఎంపిక కాగా.. ఇరిగేషన్ శాఖ మంత్రి రామలింగారెడ్డి చేతుల మీదుగా ఆయన జాతీయ అవార్డును అందుకున్నారు. అనంతరం రజినీకాంత్ మాట్లాడుతూ.. సృజనాత్మకతకు దగ్గిక్కిన గౌరవమని చెప్పారు. అత్యంత కఠిన పోటీలను నిర్వహించిన కర్ణాటక మీడియా అకాడమీ ‘ఫోకస్ ఆన్ న్యూస్ 2.0’ జాతీయస్థాయిలో ఫొటోగ్రఫీ పోటీల నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. రజనీకాంత్తోపాటు ‘నమస్తే తెలంగాణ’ మరో ఫొటోగ్రాఫర్ బందిగే గోపి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందుకున్నారు. కార్యక్రమంలో కర్ణాటక చిత్రకళా ప్రెసిడెంట్ బీఎల్ శంకర్, మాజీ ముఖ్యమంత్రి మీడియా అడ్వయిజర్ కేవీ ప్రభాకర్, మీడియా అకాడమీ చైర్మన్ ఆయేషా ఖానం, ఆర్టీఐ కమిషనర్ మమత తదితరులు పాల్గొన్నారు.