Raksha Bandhan in Flight : అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ(Rakhee Festival)ను భారతీయులు సంబురంగా చేసుకున్నారు. విదేశాల్లో ఉన్నవారు సైతం రక్షా బంధన్ రోజున ఇండియాకు వచ్చిన తమ తోబుట్టువులను కలవగా.. విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్లకు సైతం రాఖీలు కట్టారు కొందరు మహిళలు. అయితే.. 30 వేల అడుగుల ఎత్తులో రాఖీ కట్టించుకున్న ఘనత ఓ భారతీయ అమెరికన్కు మాత్రమే చెందుతుంది. శుక్రవారం విమానంలో వెళ్తున్న అతడికి మహిళా సిబ్బంది రాఖీ కట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
రాఖీ పండుగ రోజున సోదరులు తమ ఇళ్లకు వెళ్లి తోబుట్టువులతో రాఖీ కట్టించుకుంటారు. అత్యవసర విధుల్లో ఉన్న తమ సోదరులకు సైతం మహిళలు రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని చాటుకున్న సందర్భాలు చాలానే. అయితే.. ఓ భారతీయ అమెరికన్ మాత్రం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా రాఖీ వేడుకల్లో పాల్గొన్నాడు. అతడి పేరు.. సుధాన్షు కౌశిక్ (Sudhanshu Kaushik). ఆగస్టు 28, శుక్రవారం ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న అతడికి మహిళా సిబ్బంది ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు.
పండుగ పూట విధుల్లో ఉన్న ఎయిర్హోస్టెస్లు.. ఇతర మహిళా సిబ్బంది సుధాన్షునే తమ అన్నయ్యగా అనుకున్నారు. విమానం 30వేల అడుగుల ఎత్తులో ఉండగా.. సుధాన్షు చేతికి పలురకాల రాఖీలతో.. అతడి జర్నీని ప్రత్యేకంగా మలిచారు ఎయిరిండియా మహిళా సిబ్బంది. ఒక్కొక్కరుగా వారు సుధాన్షుకు రాఖీ కడుతుండగా.. ఒకరు వీడియో తీశారు. అందులో.. విమానంలోని సహాయక సిబ్బంది ఈరోజు నన్ను తమ సోదరుడు అనుకున్నట్టు ఉన్నారు అని సంతోషపడిపోయాడీ భారతీయ అమెరికన్. ఇన్స్టాగ్రామ్లో అతడు వీడియో పంచుకుంటూ ‘హ్యాపీ రాఖీ’ అంటూ క్యాప్షన్ పెట్టాడు.
ఆకాశంలో అద్భుతంగా జరిగిన ఈ రాఖీ వేడుక వీడియో క్షణాల్లోనే వైరలైంది. సుధాన్షు విషయానికొస్తే.. అతడు యువత హక్కుల కోసం పోరాడుతున్న న్యాయవాది. అంతేకాదు.. యంగ్ ఇండియా ఫౌండేషన్ అనే ఎన్జీవో వ్యవస్థాపకుడు. 2020లో నార్త్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ను స్థాపించాడు సుధాన్షు.