ఎల్లారెడ్డి (లింగారెడ్డి), ఆగస్టు 4: కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షం దంచికొట్టింది. వాగులు, వంకలు ఉప్పొంగి రహదారులపైకి నీళ్లు చేరడం, కోతకు గురవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇండ్లలోకి నీళ్లు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లింగంపేట, గాంధారి మండలాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా లింగంపేట పెద్దవాగు ఉధృతంగా ప్రవహించడంతో పోచారం ప్రాజెక్టు రాత్రికి రాత్రే నిండి పోయింది. లింగంపేట పెద్ద వాగులో ఒకరు గల్లంతయ్యారు. పల్వంచ వాగు నిండుగా ప్రవహించగా, బాన్సువాడ మండలం అవాజ్పల్లి మత్తడి, కొల్లూరు వాగు, చెదల వాగులు పొంగిపొర్లాయి. బాన్సువాడ మండలం మొగులాన్పల్లి, కొయ్యగుట్ట, బోర్లం, ఇబ్రహీంపేట్, తిర్మలాపూర్ గ్రామ శివారులోని పొలాలు నీట మునిగాయి. దుంకుడు మోరి తండాలో వరద ఇండ్లలోకి రావడంతో గ్రామస్తులు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. కామారెడ్డి- ఎల్లారెడ్డి ప్రధాన రహదారిలోని లింగంపల్లి సమీపంలోని పాముల వాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.