హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై హైకోర్టు మరికొన్ని గంటల్లో తీర్పు వెలువరించనున్నది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్ని కై, ఆ తర్వాత కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీచేసిన దానంపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను స్పీకర్ కొట్టివేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించనున్నది.
బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్.. ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్లో చేరారని, పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు గండ్ర మోహన్రావు, కే వివేక్రెడ్డి ఇప్పటికే హైకోర్టుకు తెలిపారు. ముఖ్యంగా దానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ బీ-ఫారంతో సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి పోటీచేయడం ఈ కేసులో అత్యంత కీలక ఆధారమని పేరొన్నారు.
పార్టీ ఫిరాయింపును నిర్ధారించేందుకు అసెంబ్లీ లోపల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల న్న స్పీకర్ వైఖరిని పిటిషనర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. మరో పార్టీ తరఫున పోటీచేయడం ద్వారా అసలు పార్టీ పట్ల తన రాజకీయ అనుబంధాన్ని వదులుకున్నట్టు స్పష్టమవుతున్నప్పుడు వేరే ఆధారాల కోసం చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. స్పీకర్ నిర్ణయం న్యాయపరమైన పరిశీలనకు లోబడి ఉంటుందని, స్పీకర్ అధికారాలు అపరిమితమైనవి కావని వాదించారు.
పిటిషనర్ల వాదనలను దానం నాగేందర్ తరఫు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నట్టు ఎకడా ప్రకటించలేదని తెలిపారు. దానం ఇప్పటికీ అసెంబ్లీ రికార్డుల్లో బీఆర్ఎస్ సభ్యుడిగానే ఉన్నారని చెప్పారు. ఆయన కాంగ్రెస్ నేతలను కలవడం, వారితో ఫొటోలు దిగడం, కాంగ్రెస్ కండువా ధరించడం లేదా ఆయన కాంగ్రెస్లో చేరినట్టు మీడియాలో రావడం లాంటి అంశాలు పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టు నిర్ధారించేందుకు సరిపోవని పేరొన్నారు. దానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీచేసినంత మాత్రాన అసెంబ్లీ సభ్యత్వం కోల్పోయినట్టు భావించరాదని వాదించారు.